కొంచెం మర్యాదగా ప్రవర్తించండి

Nivetha Thomas Fire on Fans in Twitter - Sakshi

సినిమా: వదంతులను ఇంతకుముందు హీరోయిన్లు లైట్‌గా తీసుకునేవారు. మరి కొందరైతే వాటిని ఎంజాయ్‌ చేస్తున్నట్లు చెబుతుండేవారు. ఈ తరం నటీమణులు అలా కాదు. ఎదురుదాడి చేస్తున్నారు. మేమూ మనుషులమే, మాకూ అమ్మనాన్న అంటూ కుటుంబం ఉంటుంది. సగటు మనిషిగా మాతోనూ సభ్యతగా ప్రవర్తించండి. అంటూ ఘాటుగానే చురకలు వేస్తున్నారు. ఇటీవల నటి రష్మిక ఇలానే నెటిజన్లపై మండిపడింది. తాజాగా  నటి నివేదాథామస్‌ తనదైన ధోరణిలో తన అభిమానులకు క్లాస్‌ పీకింది. ఈ అమ్మడి గురించి చెప్పాలంటే కేరళా కుట్టి అయినా తమిళం, తెలుగు అంటూ దక్షిణాది భాషల్లో నటించేస్తోంది. పాపనాశం చిత్రంలో కమలహాసన్‌కు పెద్ద కూతురిగా నటించి కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత టాలీవుడ్‌లో కథానాయకి అయిపోయింది. తాజాగా కోలీవుడ్‌లో దర్బార్‌ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురిగా నటించింది. కాగా ఆ అమ్మడు సమీపకాలంలో ఆన్‌లైన్‌లో అభిమానులతో ముచ్చటించింది.

అయితే అభిమానులడిగిన కొన్ని ప్రశ్నలకే బదులిచ్చింది. చాలా ప్రశ్నలకు కోపాన్ని దిగమింగుకుని మౌనం వహించింది. కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలపై ట్విట్టర్‌లో స్పందించింది. అందులో తనలో ఆన్‌లైన్‌లో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించిన వారందరికీ ధన్యవాదాలు. కొందరడిగిన ప్రశ్నలకు బదులివ్వడం జాలీగా అనిపించింది. మరి కొందరు అడిగిన ప్రేమలో పడ్డావా? పెళ్లెప్పుడు? నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా? లాంటి ప్రశ్నలకు బదులివ్వలేదు. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే ముందుగా మీరు సహ మనిషితో మాట్లాడుతున్నానన్న సంగతిని గుర్తించుకోండి. కొంచెం మర్యాద ఇవ్వండి. నా కోసం సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు. త్వరలో మళ్లీ కలుద్దాం అని పేర్కొంది. దీంతో నటి నివేదాథామస్‌ జాణతనానికి నెటిజన్లు విస్తుపోతున్నారు. నటీమణులపై చౌకబారుతనంగా ప్రవర్తించే వారికి బాగానే బుద్ధి చెప్పిందని అభినందిస్తున్నారు. ఆరంభంలోనే ఇలా గడుసుగా ప్రవర్తించడం నివేదా థామస్‌కు అవసరమా అనే వారూ లేకపోలేదు. ఏదేమైనా నివేదా థామస్‌ అభిమానులపై వేసిన చురకలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top