
నాని క్రికెట్ మ్యాచ్ వేసవిలో వెండితెరపైకి రానుంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇందులో రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించనున్నారాయన.
శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ‘‘జెర్సీ’ సినిమాను 2019 ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజును ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాం. అందుకు ఇంకా 146 రోజులు ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అంటే.. గ్రౌండ్లో రెచ్చిపోయి నాని కొట్టిన సిక్సర్లు, ఫోర్లను చూసి ఎంజాయ్ చేయడానికి కౌంట్డౌన్ మొదలైందన్నమాట.