బాలయ్య, నాగ్ల మధ్య ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

బాలయ్య, నాగ్ల మధ్య ఏం జరిగింది?

Published Tue, Dec 2 2014 11:31 AM

బాలయ్య, నాగ్ల మధ్య ఏం జరిగింది? - Sakshi

'మేము సైతం' కార్యక్రమంలో  నటుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగు చిత్రసీమలో అగ్ర నటులుగా ఉన్న బాలకృష్ణ, నాగార్జునలు... ఒకరినొకరు పలకరించుకోవటానికి కూడా ఇష్టపడటం లేదట. హుద్‌ హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ మేము సైతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏదైనా కార్యక్రమం కానీ, వేడుకలో ఎదురైన‌ప్పుడు ఇద్దరు వ్యక్తులు పలకరించుకోవటం కనీస సంప్రదాయం.

అయితే బాలయ్య, నాగ్ మాత్రం పలకరించుకోవటం కాదు కదా... కనీసం ఒకరినొకరు చూసుకోవటం కూడా జరగలేదు.  చిత్రసీమ మొత్తం కలిసి మెలిసి పలు కార్యక్రమాలు నిర్వహించినా వారిద్దరూ మాత్రం ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు.  గత ఏడాదిగా వీరిద్దరి మధ్య సైలెంట్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా,అక్కినేని నాగేశ్వరరావు నట రజితోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఘన సన్మాన సభకు బాలయ్యకు ఆహ్వానం అందలేదు. అక్కినేనితో కలిసి నటించిన అలనాటి హీరోయిన్లతో పాటు మొత్తం సినీ పరిశ్రమ ఆ సభకు తరలి వచ్చింది.

 

అయితే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఆ వేదికపై కనపడలేదు.ఆ తర్వాత రోజే నాగార్జున ...బాలయ్య ఇంటికి వెళ్లి జరిగిన పొరపాటును సరిచేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్రకు కూడా బాలయ్య హాజరు కాలేదు. అప్పట్లో ఆ విషయం హాట్ టాఫిక్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందనేది వారిద్దరికే తెలియాలి మరి...

Advertisement
Advertisement