
సాక్షి, భోపాల్ : వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావత్ను విడుదల చేసి తీరుతామని మధ్యప్రదేశ్లో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పద్మావత్ సినిమాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించి సుప్రీం ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని మధ్యప్రదేశ్ సర్కార్ యోచిస్తున్నా థియేటర్ యజమానులు మాత్రం వెనక్కితగ్గలేదు. మధ్యప్రదేశ్లో జనవరి 25న 150కి పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నామని, దీనికి తగిన భద్రత కల్పించాలని థియేటర్ల యజమానులు, పంపిణీదారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి అదనపు భద్రత కోరాలని కూడా సినిమా థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించింది.
దీనికి సంబంధించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, డీజీపీ రిషికుమార్ శుక్లాలను థియేటర్ యజమానుల అసోసియేషన్ త్వరలోనే కలవనుంది. మరోవైపు సినిమా విడుదలను నిరసిస్తూ తీవ్ర ఆందోళనలు చేపట్టిన రాజ్పుట్ కర్ణిసేన పద్మావత్ను ప్రదర్శిస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.