వాళ్లంతా బుద్ధిలేని వాళ్లేనా: నటి కౌంటర్‌

Mohena Kumari Singh Slams Trolls Over Her Ghoonghat Photo - Sakshi

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపే క్రమంలో టీవీ నటి, రేవా రాకుమారి మోహనా కుమారి సింగ్‌ షేర్‌ చేసిన ఫొటో ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మోహనా సింగ్‌కు ఇటీవలే వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజ్‌పూత్‌ కుటుంబానికి చెందిన సుయేష్‌ రావత్‌ను ఆమె పెళ్లాడారు. ఇరు కుటుంబాల సమక్షంలో వారి పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తన పుట్టింటి, అత్తింటి వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసిన మోహన... ‘ రేవా, రావత్‌ కుటుంబం నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమ, శాంతి, ఐక్యతను వ్యాప్తి చేయండి. సంతోషంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచానికి, మన దేశానికి కూడా’ అంటూ విషెస్‌ తెలిపారు.

ఈ క్రమంలో మోహన పోస్టుపై స్పందించిన ఓ నెటిజన్‌.. మీ ముఖంపై ముసుగు ఎందుకు ఉందంటూ ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా...‘ఎందుకంటే వీళ్లు పితృస్వామ్య వ్యవస్థ పెట్టిన ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. చదువుకున్నా వీళ్లకు బుద్ధి మాత్రం పెరగలేదు అంటూ మరో నెటిజన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన మోహన..‘ క్రిస్టియన్లు కూడా పెళ్లి సమయంలో మేలి ముసుగు కప్పుకుంటారు. ముస్లిం కూడా ఇలాగే చేస్తారు. అయితే వాళ్లందరూ చదువురాని వాళ్లే అంటారా! ఇది రాజ్‌పూత్‌ వంశస్తుల ఆచారం. వివాహ సమయంలో ఇలా ముసుగు ధరించడం సంప్రదాయం. ఇలా చేయమని నన్నెవరూ బలవంతపెట్టలేదు. నా ఇష్టపూర్వకంగా ఈ పనిచేశా’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ఇక మోహన భర్త సుయేష్‌ సైతం.. ‘పబ్లిసిటీ కోసం పాకులాడే వాళ్లు ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారు’ అంటూ సదరు నెటిజన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా డాన్స్‌ ఇండియా డాన్స్ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోహనా.. ఓ ప్రముఖ హిందీ చానెల్‌లో ప్రసారమయ్యే సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రేవా రాజవంశానికి చెందిన ఆమె వివాహం అక్టోబరులో జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top