అర్చనానందం

అర్చనానందం


హర్షాతిరేకంలో మునిగి తేలుతున్నారు నటి అర్చన. నిజం చెప్పాలంటే ఈ తెలుగమ్మాయి సినిమాలు సక్సెస్ కోసం పోరాడుతున్నారు. అర్చనలో అన్ని రకాల పాత్రల్ని అవలీలగా పోషించగల సత్తా ఉంది. దాన్ని ఆమె నిరూపించుకున్నారు కూడా. హీరోయిన్‌గా, విలనీగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పాత్రల్లోకి దూరి నటించడం అర్చనకు కొట్టిన పిండే అని చెప్పాలి. అంతేకాదు తెలుగు, తమిళం, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కన్నడ, తమిళ భాషల్లో నటించిన రెండు చిత్రాలు విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

 అర్చన కన్నడంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సరసన మైత్రి చిత్రంలో నటించారు. గిరిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం గురించి అర్చన తెలుపుతూ మైత్రి చిత్రంలో మోహన్‌లాల్ భార్యగా నటించానని తెలిపారు. ఈ గృహిణి పాత్రతో మోహన్‌లాల్ సరసన నటించడం చాలా మంచి అనుభవం అని పేర్కొన్నారు. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గల నటుడు మోహన్‌లాల్ అని చెప్పారు. ఇక తమిళంలో నాడోడి వంశం చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తి యాక్షన్ డ్రామా కథా చిత్రం అని తెలిపారు.

 

 తన పాత్ర కూడా చాలా సీరియస్‌గా ఉంటుందన్నారు. అయితే తాను ఎలాంటి పాత్ర పోషించాలని ఆశించానో అలాంటి పాత్రను ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. చిత్రంతోపాటు సన్నివేశాల్లో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానన్నారు. ఈ చిత్రం కూడా త్వరలో తెరపైకి రానుందని తెలిపారు. ఈ రెండు చిత్రాలు విడుదల కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి తెలుగులో ఆనందిని అనే చిత్రం చేయనున్నట్లు తెలిపారు. రొమాంటిక్ డ్రామా చిత్రానికి నిర్ణయ దర్శకత్వం వహించనున్నారని అర్చన వెల్లడించారు.         

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top