ఆ వార్తల్లో నిజంలేదు | Mehreen Pirzada clears air about rumours | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో నిజంలేదు

Jul 4 2018 12:50 AM | Updated on Jul 4 2018 12:50 AM

Mehreen Pirzada clears air about rumours  - Sakshi

చికాగో సెక్స్‌ స్కాండల్‌ వివాదం టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై అప్పట్లో కథానాయిక మెహరీన్‌ స్పందించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘పంతం’. గోపీచంద్‌ హీరోగా చక్రవర్తి దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. చికాగో వివాదంలోకి అనవసరంగా ఆమెను మీడియా లాగుతోందని ‘పంతం’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మెహరీన్‌ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్నట్లుగా చికాగో వివాదం గురించి నేను ఎవ్వరికీ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మీడియాతో నాకు మంచి రిలేషనే ఉంది. ముంబైలో ఉన్న నేను వైరల్‌ ఫీవర్‌ వల్ల చివరిగా జరిగిన ‘పంతం’ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొనలేకపోయాను’’ అని అన్నారు. ఇంకా యూఎస్‌లో జరిగిన సంఘటన గురించి చెబుతూ– ‘‘మా ఫ్యామిలీతో వీకెండ్‌ హాలీడే కోసం లాస్‌ ఏంజిల్‌కి వెళ్లాను.

ఆ సమయంలో ఇమ్మిగ్రేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు నన్ను టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్‌గా గుర్తించారు. చికాగో సెక్స్‌ స్కాండల్‌ గురించి చెప్పారు. నిజానికి చికాగో వివాదం గురించి నేను ఫస్ట్‌ టైమ్‌ అప్పుడే విన్నాను. ఆ తర్వాత ఈ ఇష్యూతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. వాళ్లు నాకు క్షమాపణలు చెప్పి, నా ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు కలిగించలేదు. ఇష్యూ తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా, మరే ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని ఈ విషయంపై పబ్లిక్‌గా మాట్లాడాను. నిజానికి ఈ అనుభవం నాకు ఇబ్బంది కలిగించింది. ఎవరో కొందరి వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు రావడం, ఇమేజ్‌ దెబ్బ తినడం నాకు బాధగా ఉంది. ఈ విషయంలో తప్పు చేసిన దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఈ సంఘటన గురించి నేను చివరి సారిగా చెబుతున్నాను. అలాగే నన్ను సంప్రదించకుండా నా గురించిన కథనాలను ప్రచురించవద్దని మీడియా వారిని రీక్వెస్ట్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement