ఎలాంటి పాత్రనైనా చేస్తా..

Latha Rao Statement On Her Characters In Movies - Sakshi

తమిళసినిమా: బుల్లితెర తారలు వెండితెరపై కనిపించాలని ఆరాట పడటం, అదే విధంగా వెండితెరపై ఏలిన తారలు బుల్లితెరను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. అలా సినిమాల్లో రాణించాలని ఆరాట పడుతున్న మరో నటి లతారావ్‌. సినిమాలో ఏ తరహా పాత్రనైనా చేయడానికి రెడీ అంటోంది ఈ భామ. ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వెండితెరపైనా గుర్తింపు పొందుతోంది. ఇటీవల తెరపైకి వచ్చిన గడికార మణిదర్‌గళ్‌ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్న లతారావ్‌ ఈ సందర్భంగా తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ బుల్లితెరపై నాలుగు భాషల్లో నటించి గుర్తింపు పొందానని చెప్పింది.

అయితే ఇప్పుడు సినిమాల్లో రాణించాలన్న కోరికతో బుల్లి తెరకు స్వస్తి చెప్పానని తెలిపింది. ఇంతకుముందు తిల్లాలంగడి చిత్రంలో వడివేలుకు జంటగా కామెడీ పాత్రలో నటించినట్లు పేర్కొంది. అలా పరిచయం అయిన తాను శశికుమార్‌ దర్శకత్వం వహించిన ఈశన్‌ చిత్రంలో, సముద్రఖని దర్శకత్వం వహించిన నిమిర్న్‌దు నిల్, సుదీప్‌ హీరోగా కేఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించిన ముడింజా ఇవన్‌ పుడి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించినట్లు తెలిపింది. తాజాగా కిశోర్‌కు జంటగా గడికార మనిదర్‌గళ్‌ చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఇందులో మధ్య తరగతికి చెందిన ముగ్గురు పిల్లలకు తల్లిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించినట్లు చెప్పింది. అదే విధంగా ప్రస్తుతం భరత్‌ కథానాయకుడిగా నటిస్తున్న 8 చిత్రంలోనూ, వివేక్, దేవయాని కలిసి నటిస్తున్న ఎళుమిన్‌ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నట్లు, ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని నటి లతారావ్‌ పేర్కొంది. మొత్తం మీద మరో క్యారెక్టర్‌ ఆర్టిస్‌ కోలీవుడ్‌కు దొరికినట్టే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top