వివాదంలో మరో చారిత్రక చిత్రం
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన పద్మావత్ వివాదం మరువక ముందే మరో చారిత్రక చిత్రం వివాదంలో ఇరుక్కుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్తో ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్వ బ్రాహ్మణ మహా సభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్న ఈ సినిమాలో ఝాన్సీ రాణికి, ఓ బ్రిటీష్ వ్యక్తికి మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు. జై శ్రీ మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం ‘రాణీ’ ఆధారంగా మణికర్ణిక సినిమానుతెరకెక్కిస్తున్నారన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ చరిత్రకు మచ్చ తెచ్చే విధంగా సినిమాను రూపొందిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వివాదంపై మణికర్ణిక టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలు