అందుకే తప్పుకున్నా
ఒక సినిమా నుంచి హీరో లేదా హీరోయిన్ తప్పుకుంటే కారణం ఏదైనా ఔత్సాహికరాయుళ్లు ‘ఇదీ కారణం’ అంటూ ఏదో స్టోరీ అల్లుతారు. అలానే అనూ ఇమ్మాన్యుయేల్ చుట్టూ స్టోరీలు అల్లడానికి కొంతమంది రెడీ అయిపోయారు. ఆ స్టోరీలకు ఫుల్స్టాప్ పడేలా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అసలు కారణం బయటపెట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మెత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇప్పుడీ చిత్రంలో అనూ లేరు.
‘‘యూఎస్లో చేయబోయే 50 డేస్ షెడ్యూల్ కోసం అనూ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. అందుకని మా సినిమాలో నటించరు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ క్లారిఫికేషన్ ఇచ్చాం’’ అని ట్వీటర్ ఖాతాలో నిర్మాతలు పేర్కొన్నారు. ఈ విషయంపై అనూ స్పందిస్తూ – ‘‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా డేట్స్ క్లాష్ కారణంగా అనుకోకుండా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘అఅఆ’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు.