తెరపైకి చరిత్ర : వార్ హీరో ఫస్ట్ లుక్
దేశంలో తొలి పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత బయోపిక్ తెరపైకి వస్తోంది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న వార్ హీరో 'సుబేదార్ జోగిందర్ సింగ్' సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. హిందీ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. సాగా మ్యూజిక్, యూనిసిస్ ఇన్ఫోసొల్యూన్స్తో కలిసి సెవన్ కలర్స్ మోషన్ ఫిక్చర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. గిప్పి గ్రేవాల్, గుగ్గి గిల్, కుల్విన్దర్ బిల్ల, అదితి శర్మ, రాజ్వీర్ జవాండ, రోషన్ ప్రిన్స్, సర్దార్ సోహిలు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు.
స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో, ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో సుబేదార్ జోగిందర్సింగ్ పనిచేశారు. మూడు యుద్ధాల్లో ఆయన తన ప్రాణాలను ఎదురొడ్డి మరీ దేశం కోసం పోరాటం చేశారు. 1962లో జరిగిన భారత్ - చైనా యుద్ధంలో సుబేదార్ వీర మరణం పొందారు. మరణానంతరం సుబేదార్ను భారత ప్రభుత్వం పరమ్ వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. యుద్ధకాలంలో సుబేదార్ కనబర్చిన వీరత్వం త్వరలో తెర పైకి వస్తోంది. గిప్పి గ్రేవాల్ ఈ సినిమాలో అమరవీరుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ఫస్ట్ లుక్తో గిప్పి గ్రేవాల్, సుబేదార్గా ఎలా మారిపోయారో తెలిసిపోతుంది.