సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ స్టార్ హోదా వచ్చాకా..బాలీవుడ్కి వెళ్లి సత్తా చాటాలని అనుకుంటారు. సౌత్లో రెండు, మూడు హిట్లు పడితే చాలు.. బాలీవుడ్పై ఫోకస్ చేస్తారు. అలా దక్షిణాది నుంచి వెళ్లిన తారల్లో కొంతమంది బాలీవుడ్లోనూ రాణిస్తే.. మరికొంతమంది అవకాశాలు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి వచ్చారు. చాన్స్ల సంగతి పక్కన పెడితే.. సౌత్ వాళ్లకు సరైన గౌరవం కూడా ఇవ్వరని అంటోంది నటి రేజీనా కసాండ్రా.
16 ఏళ్లకే కెరీర్ని ప్రారంభించిన రెజీనా.. తెలుగులో రవితేజ, గోపీచంద్, సాయిదుర్గు తేజ్, సందీప్ కిషన్ లాంటి హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఇక్కడ వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ ప్రయత్నాలు చేసింది. ‘ఏక్ లడ్కీకో దేఖా తో ఐసా లగా’ అనే చిత్రంలో ఆమె నటించింది. ఆ మూవీతో రెజీనాకు కూడా అంత పేరేమీ రాలేదు. తర్వాత మరి కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ సినిమా ఫలితాల సంగతి పక్కన పెడితే.. అసలు బాలీవుడ్కి దక్షిణాది నటీనటులు అంటే చిన్నచూపు అని.. వాళ్ల ప్రవర్తననే వెరైటీగా ఉంటుందని రెజీనా అంటోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లో తనకు ఎదురైన అనుభవాల గురించి రెజీనా చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్ లో నా ప్రయాణం ఊహించినంత సులభంగా సాగలేదు. హిందీ భాషపై నాకు పూర్తి పట్టు ఉన్నా, మాట్లాడటంతో పాటూ హిందీ రాయగలిగినా, వేరే సినిమాల్లో ఇతర హీరోయిన్లలాగా డబ్బింగ్ ఆర్టిస్టులను వినియోగించుకోకపోయినా బాలీవుడ్ లో నేను పూర్తిగా కలిసిపోయాననే ఫీలింగ్ కలగలేదు.
సౌత్ నుంచి వచ్చిన నన్ను కొందరు వేరేలా చూశారు. నా నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన, మాట తీరు అసౌకర్యానికి గురి చేసింది. అవన్నీ చూశాక నాలో ఒక రకమైన భయం మొదలైంది’ అని రెజీనా చెప్పుకొచ్చింది.ఇలాంటి అనుభవం అందరికి ఎదురవుతుందని కూడా చెప్పలేమన్నారు. అంతేకాదు బాలీవుడ్ మొత్తం అలాంటిదే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదని రెజీనా అన్నారు. అందరూ ఒకేలా ఉండరని, తనకు మద్దతుగా నిలుస్తూ, గౌరవించిన వాళ్లు కూడా ఉన్నారని రెజీనా చెప్పింది.


