ఇళయరాజా పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు జోరు తగ్గిపోయింది గానీ 90స్, 20స్ టైంలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. అయితే గత కొన్నాళ్ల నుంచి కాపీరైట్ పేరుతో కోర్టులో కేసులు వేస్తూ పలువురు దర్శకనిర్మాతలని ఇబ్బంది పెడుతూ వచ్చారు. వీటిలో చాలావరకు ఈయన అనుకూలంగా తీర్పులే వచ్చాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈయనకు పెద్ద షాకిచ్చింది.
(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)
గతేడాది 'అగత్యా' అనే సినిమా విడుదల సందర్భంగా ఇళయరాజా, ఆడియో సంస్థ 'సరిగమ'కు మధ్య వివాదం మొదలైంది. ఇదికాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేంతవరకు 'సరిగమ'కు సొంతమైన 134 సినిమాల్లో పాటలని ఇళయారాజా ఉపయోగించడానికి ఏ మాత్రం వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
1976 నుంచి 2001 వరకు ఇళయరాజా స్వరపరిచిన 134 సినిమాల పాటల హక్కులని ఆయా నిర్మాతలు.. శాశ్వత ప్రాతిపదికన సరిగమ ఆడియో సంస్థకు విక్రయించారు. అయితే అందులోని కొన్ని పాటలని ఉపయోగించుకోవచ్చని.. ఇళయరాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్స్కి అనుమతి ఇచ్చారు. దీంతో సరిగమ.. కోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు ఇళయారాజాకు షాకిచ్చేలా తీర్పు వచ్చింది. నిర్మాత నుంచి కొనుగోలు చేసిన ఆడియో సంస్థకే సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా సాంగ్స్ ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. దీనిబట్టి ఇకపై సదరు పాటలపై కాపీరైట్ లాంటివి వేయడానికి ఇళయరాజాకు కుదరదు. అలానే సదరు పాటలకు ఈయనకు హక్కు లేనట్లే.
(ఇదీ చదవండి: రిలీజ్కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)


