బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక ఒప్పందంలో ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ హాజరు కావడం లేదు. దీంతో తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది.
2017న వ్యాపారావేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలో నటి అమీషా పటేల్ ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని పవన్ కుమార్ వర్మ రూ. 14.50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్లోని ఢిల్లీ రోడ్లోని ఒక హోటల్లో అమీషా పటేల్ కోసం లగ్జరీ హోటల్ బుకింగ్ చేశారు. అయితే, చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాకిచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమీషా. . రూ. 10 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని మిగిలిన రూ. 4.50 లక్షల చెక్కు తరువాత బౌన్స్ అయిందని కోర్టుకు వర్మ తెలిపారు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు అమీషా పటేల్కు పలుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ, ఆమె హాజరు కాలేదు. ఆమె హాజరును నిర్ధారించడానికి కోర్టు ఇప్పుడు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఈ వివాదం 2017 నాటిదని, ఒక ఒప్పందం ద్వారా సమస్య ఎప్పుడో క్లియర్ అయిందన్నారు. ఆమేరకు మొత్తం డబ్బును తిరిగి ఇచ్చిందని ఆయన అన్నారు.
అమీషా పటేల్ వివరణ
ఈ విషయంపై అమీషా పటేల్ సోషల్మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. 'అర్ధిక లావాదేవీలకు సంబంధించి పవన్ వర్మతో సెటిల్మెంట్ గతంలోనే పూర్తి అయింది. ఆమేరకు డీడ్పై కూడా అతను సంతకం చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను చేస్తున్న మోసంపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తను ఇప్పటికైనా మానుకోవాలి.' అని అమీషా తెలిపింది.


