రణ్వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్'. రెండు నెలల క్రితం థియేటర్లలో కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో నెలరోజుల్లో సీక్వెల్ కూడా విడుదల చేయనున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూవీ టీమ్కి షాక్ తగిలింది. ముంబైలో ఇకపై షూటింగ్ చేయడానికి అనుమతి లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశముంది. ఇంతకీ అసలేమైంది?
'ధురంధర్' చిత్రాన్ని తీసిన దర్శకుడు ఆదిత్య ధర్.. జియో స్టూడియోస్తో కలిసి నిర్మాణంలో భాగమయ్యాడు. 'బీ62 స్టూడియోస్' ఆదిత్యదే. ఈ నిర్మాణ సంస్థ పలుమార్లు నియమనిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఇకపై ముంబైలో షూటింగ్ కి అనుమతించకూడదని, ఈ మేరకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)
కొన్నిరోజుల క్రితం ముంబైలోని చారిత్రక పోర్ట్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు డ్రోస్ ఎగరవేయడంతో నిర్మాణ సంస్థకు చెందిన మేనేజర్పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా ముంబైలోని పలు వీధుల్లో షూటింగ్ జరగ్గా.. ఆ సమయంలో క్రాకర్స్, మండే పదార్థాలు ఉపయోగించారు. ఇది కండీషన్స్ ఉల్లంఘించడమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఇలా వరసగా ఉల్లంఘనలని తీవ్రంగా పరిగణించిన బీఎమ్సీ.. ఆదిత్య ధర్కి చెందిన బీ62 స్టూడియోస్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రతిపాదించింది. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ.. ముంబైలో షూటింగ్ చేయడం కుదరదు.
అలానే రీసెంట్ టైంలో అనుతి లేకుండా బిల్డింగ్లపై షూటింగ్ చేసినందుకు, అక్రమంగా జనరేటర్లు వాడినందుకుగానూ లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ని కూడా అధికారులు రద్దు చేశారు. మరి ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఏమని స్పందిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)


