నా శత్రువు నాతోనే ఉన్నాడు

Burra Katha Movie Trailer Launch - Sakshi

‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు.. కృష్ణుని శత్రువు కంసుడు... నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ఆది సాయికుమార్‌ డైలాగులతో ప్రారంభమయ్యే ‘బుర్రకథ’ ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. ఆది సాయికుమార్‌ హీరోగా, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరోయిన్లుగా నటించారు. రచయిత ‘డైమండ్‌’ రత్నబాబు ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీకాంత్‌ దీపాల, కిషోర్, కిరణ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హీరో వెంకటేష్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మంచి స్టోరీ. ఆది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు.

రత్నంబాబు తెరకెక్కించిన ఈ అందమైన కథని ప్రతి ఒక్కరూ చూడాలి’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ చూసి వింటేజ్‌ క్రియేషన్స్‌ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులు కొన్నారు. సినిమాపై చాలా నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు శ్రీకాంత్‌ దీపాల. డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘హీరో నమ్మకంతోనే ఒక డైరెక్టర్‌ వస్తాడు. ప్రతిభ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, వారందరినీ ప్రోత్సహించడానికి నిర్మాతలు చాలా అవసరం. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా ప్రోత్సాహం దొరికింది.

ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చాలా బాగుండటంతో పాటు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ – ‘‘నాని, సందీప్‌ కిషన్, సాయి తేజ్‌లతో సహా మిగతా హీరోలందరూ మా సినిమా గురుంచి పాజిటివ్‌ ట్వీట్స్‌ చేసినందుకు థ్యాంక్స్‌. నాకు హిట్‌ పడి చాలా కాలం అయింది.. ఈ సినిమాతో మళ్లీ హిట్‌ సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్‌. ‘‘బుర్రకథ’ నా 4వ సినిమా. మంచి హిట్‌ అవుతుందని భావిస్తున్నా’’ అన్నారు కిరణ్‌రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్‌.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top