రాష్ట్ర విభజనతో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఏం కాబోతోంది? దాదాపు పాతికేళ్ల క్రితం నాటి మద్రాసు నగరం నుంచి హైదరాబాద్కు తరలివచ్చిన పరిశ్రమలో కొంత భాగం ఇప్పుడు మళ్లీ ఏ విశాఖపట్నానికో లేదా కొత్త రాజధాని చుట్టుపక్కలకో తరలి వెళ్తుందా?
రాష్ట్ర విభజనతో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఏం కాబోతోంది? దాదాపు పాతికేళ్ల క్రితం నాటి మద్రాసు నగరం నుంచి హైదరాబాద్కు తరలివచ్చిన పరిశ్రమలో కొంత భాగం ఇప్పుడు మళ్లీ ఏ విశాఖపట్నానికో లేదా కొత్త రాజధాని చుట్టుపక్కలకో తరలి వెళ్తుందా? ఈ ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. అయితే.. తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చినంత సులభంగా మాత్రం హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి అప్పుడే పరిశ్రమ వెళ్లకపోవచ్చని సీనియర్ నిర్మాతలు కొందరు అంటున్నారు. వెయ్యి కోట్ల రూపాయల తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. అయితే.. కొన్ని తరాలుగా వాళ్లంతా హైదరాబాద్ నగరంలోనే స్థిరపడిపోయారు. ఇప్పుడు తరలి వెళ్లాలంటే కొత్త రాష్ట్రంలో పన్నుల విధానం, మౌలిక సదుపాయాలు, ఆదాయం, పిల్లల చదువు.. ఇలా అనేక అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ తరం వాళ్లు బహుశా ఇక్కడే ఉండాలనుకోవచ్చని దగ్గుబాటి సురేష్బాబు అంటున్నారు.
1980ల చివరి కాలంలోను, 1990ల తొలి నాళ్లలోను మద్రాసు నుంచి హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. అప్పట్లో ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ షూటింగులు చేసుకునేవారు. తర్వాత పెద్దపెద్ద స్టూడియోలు, ఫిలిం సిటీలు కూడా రావడంతో పరిశ్రమ పాతుకుపోయింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా అరకు లాంటి ప్రాంతాలు ఇప్పటికీ షూటింగులకు స్వర్గధామాలుగా ఉన్నాయి. కానీ పరిశ్రమ తరలి వెళ్లాలంటే మాత్రం చాలా కాలం పట్టొచ్చని మరో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా సినీ వ్యాపారం సాగాలంటే పన్నుల విధానమే ముఖ్యమని ఆయన చెప్పారు. పన్నురాయితీలు ఇస్తే సహజంగానే ఎక్కువమంది ఆకర్షితులు అవుతారన్నారు. కేంద్రం చెబుతున్న టాక్స్ హాలిడే విధానం సినీ పరిశ్రమకు కూడా వర్తిస్తే మాత్రం తరలి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు.