
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి దేశభక్తి మేళవించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ శుక్రవారం ‘ప్యాడ్మన్’తో థియేటర్లలో అడుగుపెట్టనున్న అక్కీ.. వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి తన తదుపరి చిత్రాన్ని లైన్లో పెట్టాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అక్షయ్ తాజా సినిమా ‘గోల్డ్’.. 1946 ఒలింపిక్స్ లో భారత దేశానికి హాకీలో గోల్డ్ మెడల్ అందించిన హాకీ జట్టు కోచ్ జీవిత కథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది.
అప్పటివరకు బ్రిటిష్ ఇండియా భాగంగా ఆడిన భారత హాకీ జట్టు తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించడం వెనుక కోచ్ అందించిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం, ఇందుకోసం కోచ్తోపాటు ఆటగాళ్లు పడిన సంఘర్షణ ఇతివృత్తంగా సినిమా తెరకెక్కినట్టు నిమిషం నిడివి ఉన్న టీజర్ను బట్టి తెలుస్తోంది. సాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల కానుంది.