పాడమని నన్నడగవలెనా..పరవశించి నే పాడనా! అంటున్నారు ఈ తరం కథా నాయికలు. పాతతరం తారామణులు తమ పాత్రలకు తామే గాత్రాన్ని ఇచ్చేవారు.
చెన్నై : పాడమని నన్నడగవలెనా..పరవశించి నే పాడనా! అంటున్నారు ఈ తరం కథా నాయికలు. పాతతరం తారామణులు తమ పాత్రలకు తామే గాత్రాన్ని ఇచ్చేవారు. సంగీత ప్రవేశం లేకపోవడం, రాగస్వరాలు పలకలేకపోవడం తదితర కారణాలతో ప్లేబ్లాక్ సింగర్స్ వచ్చారు. తాజాగా హీరోయిన్లు పాడడంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. విశేషం ఏమిటంటే పరభాషా తారామణులు సైతం పాడేస్తున్నారు. ఇటీవల నటి ఆండ్రియా, రమ్యా నంబీశన్, మమతా మోహన్దాస్ తదితర హీరోయిన్లు నటనతో పాటు పాడడానికి ప్రాముఖ్యమిస్తున్నారు.
ఇప్పటికే నటి శ్రుతిహాసన్ గాయనిగా రంగ ప్రవేశం చేశారు. తాజాగా తానేమి తక్కువ తిన్నానా అంటూ గాన రంగంలోకి ప్రవేశించింది నటి నిత్యామీనన్. ఈ మలయాళ బ్యూటీ తమిళంలో నటిస్తున్న తాజా చిత్రంలో ఒక పాట పాడిందట. దీనిపై ఆమె మాట్లాడుతూ తమిళంలో తొలిసారిగా పాడినా, మలయాళంలో ఇప్పటికే పలు పాటలు పాడానని తెలిపారు. కోలీవుడ్లో గాయనిగా లభించే ఆదరణను బట్టి తదుపరి తమిళంలో పాడే విషయం ఆలోచిస్తానని చెప్పారు. నటి మేఘ్నారాజ్ కూడా కన్నడంలో ఒక చిత్రంలో పాడారట. అయితే వీరంతా తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకునే విషయంలో కూడా ఆసక్తి చూపాలని సినీ వర్గాలంటున్నాయి.