పసిడి మరింత పైకి | Sakshi
Sakshi News home page

పసిడి మరింత పైకి

Published Sun, Jan 14 2018 11:56 PM

Gold Price Hike - Sakshi

న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంటుతో పసిడి ధరలు వరుసగా అయిదోవారం పరుగులు తీశాయి. న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్ఛంజీ ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంట్రాక్టుకి సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర డాలర్ల దగ్గర 0.7 శాతం పెరిగి 1,331.70 డాలర్ల వద్ద ముగిసింది. డిసెంబర్‌ నాటి కనిష్ట స్థాయిల నుంచి పసిడి రేట్లు ఇప్పటిదాకా 6.6 శాతం పైగా పెరిగాయి. అమెరికా డాలరు బలహీనంగా ఉంటుండటం.. సమీప భవిష్యత్‌లో బంగారం రేట్లు మరింత పెరగడానికి కారణం కాగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రేటు 1,300 డాలర్ల పైనే కొనసాగినన్ని రోజులు బంగారానికి బులిష్‌గానే ఉండగలదని పేర్కొన్నారు. 

పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా డాలర్‌ బేరిష్‌గానే ఉండొచ్చన్నది నిపుణుల మాట. డాలర్‌తో పోలిస్తే మిగతా దేశాల కరెన్సీలు మరింత పెరిగే అవకాశం ఉంది. సమీప భవిష్యత్‌లో సెప్టెంబర్‌ నాటి 1,357 డాలర్ల గరిష్ట స్థాయి తదుపరి కీలక నిరోధంగా ఉండగలదని నిపుణుల అంచనా. ఒకవేళ అది దాటేస్తే 2016 జూలైలో నమోదైన 1,375 డాలర్ల స్థాయికి చేరొచ్చు. సీజనల్‌ అంశాల కారణంగా త్వరలో బంగారం 1,400 డాలర్ల స్థాయికి కూడా చేరొచ్చన్నది మరికొందరి అభిప్రాయం. 

దేశీయంగా ఏడువారాల గరిష్టానికి.. 
ఆభరణాల సంస్థల కొనుగోళ్లు కారణంగా దేశీయంగాను పసిడి ధరలు మెరుగుపడ్డాయి. న్యూఢిల్లీలో 7వారాల గరిష్ట స్థాయికి పెరిగాయి. మేలిమి బంగా రం 10 గ్రాముల ధర రూ. 300 మేర పెరిగి రూ. 30,750 వద్ద, ఆభరణాల బంగారం రేటు కూడా రూ. 300 పెరిగి రూ. 30,600 వద్ద క్లోజయ్యాయి.

Advertisement
Advertisement