మరో అద్భుత ఆవిష్కరణ ప్రారంభం

Xi Jinping Opens Mega Sea Bridge In China - Sakshi

బీజింగ్‌ : ప్రపంచలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మంగళవారం ప్రారంభించారు.  హాంగ్‌ కాంగ్‌,  మాకావులకు చెందిన నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బుధవారం నుంచి ఈ వంతెనపై వాహనాల రాకపోకలు ప్రారంభమవుతాయని చైనా ప్రభుత్వం పేర్కొంది. కాగా హాంకాంగ్‌- మాకావు- మేన్‌లాండ్‌ చైనాను అనుసంధానం చేస్తూ ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 55 కి.మీ. పొడవున్న ఈ వంతెన సముద్రంపై 22.9 కి.మీ., సొరంగంలో 6.7 కి.మీ. పొడవు కలిగి ఉంటుంది. 2009లో ప్రారంభమైన వంతెన నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. హాంగ్‌ కాంగ్‌- మేన్‌లాండ్‌ చైనాను కలుపుతూ నిర్మించిన రెండు కట్టడాలను నెల రోజుల వ్యవధిలో జిన్‌పింగ్‌ ప్రారంభించడం విశేషం. గతంలో ‘గ్రేటర్‌ బే ఏరియా’ను ‘ఎకానమిక్‌ హబ్‌’గా రూపొందించాలనే లక్ష్యంతో హాంగ్‌ కాంగ్‌- మేన్‌లాండ్‌ చైనాల మధ్య అత్యంత వేగంగా ప్రయాణించే రైలును కూడా ఇటీవలే ప్రారంభించారు.

వంతెన ప్రత్యేకతలు...
* ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన కాగా, ప్రపంచంలోని అన్ని వంతెనల్లోకెల్లా ఆరో స్థానంలో ఉంది.  
* భూకంపాలు, తుఫాన్లను తట్టుకునేలా దీనిని నిర్మించారు.
* ఈ వంతెన నిర్మాణానికి 4లక్షల టన్నుల ఉక్కును వినియోగించారు.
* ప్రస్తుతం హాంకాంగ్‌ నుంచి జుహైకి ప్రయాణ సమయం 3 గంటలు కాగా, వంతెన వల్ల అది 30 నిమిషాలకు తగ్గనుంది.
* ఇది హాంగ్‌ కాంగ్‌- మేన్‌లాండ్‌లోని రెండు కృత్రిమ దీవుల్ని కలుపుతుంది.
* పలు రకాల ఎగుమతులను పెరల్‌ నది పశ్చిమం నుంచి తూర్పునకు రవాణా చేయడంలో ఈ వంతెన ప్రధాన పాత్ర పోషించనుంది.
* 2030నాటికి ఈ వంతెనపై రోజుకు 29 వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top