
ఐక్యరాజ్యసమితి: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మావోయిస్టులు, వేర్పాటువాద సంస్థలు చిన్నారుల్ని చేర్చుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘సాయుధ పోరాటంలో చిన్నారులు’ పేరిట ఐరాస రూపొందించిన వార్షిక నివేదికను గుటెరస్ విడుదల చేశారు.
భద్రతా బల గాలు, సాయుధ గ్రూప్ల మధ్య హింసకు చిన్నారులు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఒక్క జమ్మూ కశ్మీర్లోనే దాదాపు 30 స్కూళ్లను వేర్పాటువాదులు ధ్వంసం చేసి, తగులబెట్టారని గుటెరస్ తెలిపారు. తాజాగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సాయుధ శిక్షణను పాఠ్యాంశంగా చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోలు, వేర్పాటు వాదులు తల్లిదండ్రులను బెదిరించి వారి పిల్లల్ని చేర్చుకుంటున్నారని వెల్లడించారు.