26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి జాకీర్ రెహమాన్ లఖ్వి విడుదలపై ఇజ్రాయెల్ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసింది.
తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఇజ్రాయెల్
న్యూఢిల్లీ: 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి జాకీర్ రెహమాన్ లఖ్వీ విడుదలపై ఇజ్రాయెల్ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసింది. ఇండియా, ఇజ్రాయెల్పై ఆయన తిరిగి దాడులు చేసే అవకాశం ఉందని అందువల్ల లఖ్వీ విడుదల నిరాశకు గురిచేసిందని ఇజ్రాయెల్ బ్రాండ్ అంబాసిడర్ డానియల్ కార్మన్ వ్యాఖ్యానించారు. జాకీర్ రెహమాన్ లఖ్వీ అంతర్జాతీయ ఉగ్రవాది అని అలాంటి వారు ప్రపంచానికే ప్రమాదకరమని ఆయన అన్నారు.
ప్రపంచానికి మంచిది కాదు: ఫ్రాన్స్
ఫ్రాన్స్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు హోలాండ్తో జరిపిన చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. లఖ్వీ విడుదల తీవ్ర దిగ్భ్రాంతికరమని హోలాండ్ పేర్కొన్నారు.
పాక్ హామీలకు వ్యతిరేకం: భారత్
ఉగ్రవాదుల విషయంలో పాక్ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని మండిపడింది. లఖ్వీ విడుదల ముంబై ఉగ్ర దాడుల బాధితులకు అవమానకరమని, ఈ విషయంలో పాక్ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలంది. లఖ్వీ విడుదల దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. పాక్తో చర్చలను భారత్ కోరుకుంటున్నప్పటికీ తాజా పరిణామం దురదృష్టకరమని, అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు.
ఇలాంటి నిర్ణయాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. లఖ్వీకి సంబంధించిన కీలక వివరాలను కోర్టు ముందుంచడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మరోవైపు లఖ్వీ విడుదల నేపథ్యంలో భారత్కు ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనడానికి దేశం సిద్ధంగా ఉండాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.