పాక్‌పై పంజాకు ఆ మూడు దేశాలు..! | Pakistan is Surrounded On All Sides By Neighbour Countries | Sakshi
Sakshi News home page

పాక్‌పై పంజాకు ఆ మూడు దేశాలు..!

Feb 18 2019 10:21 AM | Updated on Mar 28 2019 6:10 PM

Pakistan is Surrounded On All Sides By Neighbour Countries - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌పై ఆసియా దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రమివ్వడంలో మారుపేరుగా మారుతున్న పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని పాక్‌ సరిహద్దు దేశాలే వ్యూహాలు రచిస్తున్నాయి. పాక్‌ వల్ల సైనిక, ప్రాణనష్టాలను చవిచూస్తున్న దేశాల్లో ముఖ్యంగా అసియా ఖండంలో భారత్‌, ఇరాన్‌, అఫ్ఘానిస్తాన్‌ దేశాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. సందుదొరకితే చాలు పాక్‌పై బాంబులు వర్షం కురిపించాలన్న డిమాండ్‌ ఆయా దేశాల ప్రజానికంలో బలంగా వినిపిస్తోంది. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్‌తో సహా అనేక దేశాలు అంతర్జాతీయ వేదికలపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఆ విషయాన్ని పాక్‌ కనీసం పట్టించుకున్న పాపానపోక.. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలకు ఆశ్రయాన్నిస్తూ పొరుగుదేశాల సైనికుల ప్రాణాలను బలిగొంటోంది. పాక్ దురాగతాలకు ఆగ్రహంతో ఉన్న ఈ మూడు దేశాలు( భారత్‌,ఇరాన్‌,అఫ్ఘానిస్తాన్‌) పంజావిప్పితే ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడక తప్పదని ఆయా దేశాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ నూతన ప్రధానిగా ఇటీవల ఎన్నికైన ఇమ్రాన్‌ ఖాన్‌కు భవిష్యత్తులో పొరుగు దేశాలతో సమస్యలు తప్పేలా లేవు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌.. యుద్ధం సంభవిస్తే కోలుకోవడం కష్టమేనని నేతలు హెచ్చరిస్తున్నారు.

పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మారణకాండకు పుల్వామాలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్‌ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2008లో ముంబయ్‌పైన పాకిస్తాన్‌ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామా దాడి వరకూ ఇదే వరుస. జమ్మూ–కశ్మీర్‌ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్‌కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసింది కూడా పాకిస్తానీయులే. పుల్వామా దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. పాక్‌పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని యావత్‌ భారతావని డిమాండ్‌ చేస్తోంది. డ్రాగాన్‌ అండతో రెచ్చిపోతున్న పాక్‌పై భారత్‌  మాత్రమే కాక ఇరాన్‌, అఫ్ఘానిస్తాన్‌ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. దాయాది దేశ దుశ్చర్యకు రక్తందారపోసిన జావన్ల కుటుంబాలు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని భారత ప్రధాని నరేం‍ద్ర మోదీ పాక్‌కు హెచ్చరికాలు పంపారు. 

పాక్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదు..
తమ దేశంలో ఆత్మాహుతి దాడితో 27 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. పాక్‌–ఇరాన్‌ సరిహద్దుల్లోని సిస్తాన్‌–బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఇటీవల సైనికులతో వెళ్తున్న బస్సును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చడంతో అందులోని 27 మంది మృతి చెందారు. ‘ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ధీటుగా బదులిస్తాం. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్‌ భారీ మూల్యం చెల్లించక తప్పద’ని ఇరాన్‌ సైనిక దళాల(రివల్యూషనరీ గార్డ్స్‌) కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అలీ జఫారీ పాక్‌కు భారీ హెచ్చరికలు జారీచేశారు. ఉగ్రవాద పోరులు భారీగా సైనిక నష్టం చవిచూసిన అఫ్ఘానిస్తాన్‌ కూడా పాక్‌పై గుర్రుగా ఉంది. ఉగ్రవాదుల చర్యల కారణంగా ఆ దేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అఫ్ఘానిస్తాన్‌ సమస్య పరిష్కారానికి గతంలో మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్‌ ప్రతి నిధుల మధ్య చర్చలు కూడా జరిపారు. మన్మోహన్‌సింగ్,  నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించి, అఫ్ఘాన్‌ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్‌లో పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టి కొంత తొడ్పాటును కూడా అందించారు. అయినా కూడా సమస్య మాత్రం పరిష్కారం లభించలేదు. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్‌ సంక్షోభం సృష్టించిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే.

పాకిస్తాన్‌పై వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలి..
పాకిస్తాన్‌తో పోరుకు బలోచిస్తాన్‌ కూడా మద్దతుగా నిలిచింది. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ ఘటనకు కారకులైన దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని సూచించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై వెంటనే యుద్ధాన్ని ప్రకటించాలని బీఎన్‌సీ అధ్యక్షుడు వహీద్‌ బలోచ్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. భారత్‌ వెంటనే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకోవాలని కోరింది.  అమాయకులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement