పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దు వద్ద గడచిన 48 గంటలలో ఆరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
జమ్మూకాశ్మీర్(పిటిఐ): పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దు వద్ద గడచిన 48 గంటలలో ఆరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము జిల్లా ఆర్ఎస్ పురా సెక్టార్లోని ఖార్కోలా సరిహద్దులలో పాక్ మళ్లీ మళ్లీ కాల్పులకు తెగబడుతోంది.
జమ్మూ ప్రాంతంలోని సాంబ జిల్లాలోని బీఎస్ఎఫ్ దళాలకు చెందిన మంగు చాక్, కాద్వా చెక్ పోస్ట్లపై నిన్నఉదయం నుంచి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే భారత్ సైన్యం వెంటనే స్పందించిందన్నారు. కాగా ఇరువైపులా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
పాక్ సైన్యం మంగళవారం ఒక్క రోజే హమీర్పూర్ ప్రాంతంలో మూడు సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన సంగతిని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మంగళవారం హైదరాబాద్కు చెందిన లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మరణించిన సంగతి విదితమే. మెంధార్లోని హమీర్పూర్ ప్రాంతంలో పాక్ దళాలు ప్రయోగించిన మోర్టార్ స్ప్లింటర్ తగిలి ఫిరోజ్ఖాన్ మరణించినట్లు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత నాలుగు రోజుల కాలవ్యవధిలో పాక్ సైన్యం 8 సార్లు భారత్ సరిహద్దుపై కాల్పులకు తెగబడిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.