
పాకిస్థాన్ ఉగ్రవాదులు (ప్రతీకాత్మక చిత్రం)
ఇస్లామాబాద్ : తాము ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రధాని ఐక్యరాజ్యసమితిలో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చినా అవన్నీ కల్లబొల్లి మాటలేఅని తేటతెల్లమైంది. ఉగ్రవాదులకు తమ అధికారులే రక్షణ కల్పిస్తున్నారంటూ పాక్లో ఓ నిఘా సంస్థకు చెందిన అధికారి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. మాలిక్ ముక్తార్ అహ్మద్ షాజద్ అనే వ్యక్తి పాక్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు.
గత కొద్దికాలంగా తన సీనియర్ అధికారులు చేస్తున్న వ్యవహారాలపై భగ్గుమన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు(ఐహెచ్సీ)పిటిషన్ వేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఒక్క చర్య కూడా తమ అధికారులు తీసుకోవడం లేదని, పైగా వారికి భద్రత కల్పిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ కేసు బుధవారం విచారణకు రానుంది. కాగా, ఈ ఆరోపణలపై పాక్ ఐబీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు.