కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు | Nobel prize in medicine goes to pioneers in parasitic diseases as it happened | Sakshi
Sakshi News home page

కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు

Oct 5 2015 5:48 PM | Updated on Oct 16 2018 3:25 PM

కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు - Sakshi

కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు

దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా, ఏలికపాము లాంటి..

స్టాక్‌హోమ్: దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా,  ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం, మలేరియా జబ్బులను నయంచేసే  ఔషధాలను ఆవిష్కరించి వైద్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన ఐర్లాండ్‌కు చెందిన విలియం కాంబెల్, జపాన్‌కు చెందిన సతోషి ఒమురా, చైనాకు చెందిన య్యూయు తులకు నోబెల్ అవార్డు వరించడం ఎంతైనా ముదావహం. వాస్తవానికి వారికి ఎప్పుడో నోబెల్ అవార్డును ఇవ్వాల్సింది. ఏలికపాము (రౌండ్‌వామ్ పారసైట్స్) పరాన్న జీవుల కారణంగా అంధత్వం, బోదకాలు లాంటి జబ్బులు వస్తాయి. పరాన్న జీవుల జీవనక్రమాన్ని దెబ్బతీసి వాటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టే 'అవర్‌మెక్టిన్' అనే డ్రగ్‌ను కనుగొన్నందుకుగాను విలియం కాంబెల్, సతోషి ఒమురాలకు సంయుక్తంగా సగం నోబెల్ ప్రైజ్ లభించింది. మలేరియాను అరికట్టే మెడిసిన్ 'ఆర్టేమిసినిన్'ను కనుగొన్న చైనాకు చెందిన మహిశా శాస్త్రవేత్త య్యూయు తునకు మిగతా సగం నోబెల్ ప్రైజ్ మనీ ఇవ్వాలని అవార్డు కమిటీ నిర్ణయించింది.


వైద్యరంగ చరిత్రలోనే ఈ రెండు ఆవిష్కరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బోదకాలు, మలేరియా కారణంగా కోట్లాది మంది ప్రజలు మృత్యువాత పడేవారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్న డ్రగ్స్ ఈ వ్యాధులను అరికట్టడంలో విశేష పాత్ర వహించాయి. చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్’ విభాగంలో పనిచేస్తూ చైనా సంప్రదాయ ఔషధ మొక్కల నుంచి ‘ఆర్టెమెసినిన్’ అనే డ్రగ్‌ను 84 ఏళ్ల య్యూయు తు కనుగొన్నారు. 1930లో జన్మించిన ఆమె 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో చేరారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును 523 అని పిలిచేవారు. రహస్యంగా జరిగిన ఈ పరిశోధనల్లో ఆమె స్వయంగా శరీరంలోకి మలేరియా పరాన్న జీవిని ఎక్కించుకున్నారు. తన ఏకైక కూతురును నర్సరీ హోంలో వదిలేసి ప్రాజెక్టులో పాల్గొన్నారు. ఓ దశలో మలేరియా కారణంగా చిక్కి శల్యమైన తనను చూసి తన కూతురు కూడా తనను గుర్తుపట్టలేక పోయిందని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. 'మానవాళి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలది. ఆ విషయంలో నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. నన్ను చదివించిన నా దేశానికి ఈ రీతిగా రుణం తీర్చుకున్నాను' అని ఆమె మలేరియా డ్రగ్‌ను కనుగొన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను వైద్యరంగ నిపుణులు ఇప్పటికీ గుర్తు చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement