కరోనాను ఎదుర్కో​వాలంటే అదొక్కటే మార్గం! | Covid 19 WHO Chief Suggestions World To Slow Down Virus Outbreak | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచనలు

Mar 17 2020 9:37 AM | Updated on Mar 17 2020 6:37 PM

Covid 19 WHO Chief Suggestions World To Slow Down Virus Outbreak - Sakshi

న్యూఢిల్లీ/జెనీవా: మహమ్మారి కరోనా (కోవిడ్‌) వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ కీలక సూచనలు చేశారు. అనుమానితులందరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాధికి గురైన వారికి చికిత్స అందించడంతోపాటు... అనుమానితులను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ప్రాణాంతక వైరస్‌పై గుడ్డిగా పోరాడితే నష్టమే మిగులుతుందని జెనీవాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. ‘వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మన ముందున్న చక్కటి మార్గం టెస్‌, టెస్ట్‌, టెస్ట్‌’ అని వ్యాఖ్యానించారు.
(చదవండి: ‘వైరస్‌’ మోసుకొస్తున్నారు!)

ఈ విషయంలో చైనా, దక్షిణ కొరియా, సింగపూర్‌ ముందున్నాయని తెలిపారు. అనుమానితులను గుర్తించి, చికిత్స అందించడం ద్వారానే ఆయా దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఇక అల్పాదాయ దేశాల పరిస్థితి మరీ దారుణంగా మారనుందని అన్నారు. అసలే పోషకాహార లోపంతో, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి వైరస్‌ సోకితే నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వైరస్‌కు చెక్‌)

వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి.. రోగగ్రస్తుల్ని ఐసోలేషన్‌ వార్డుల్లో పెట్టకపోతే.. మనుషుల మధ్య వైరస్‌ వ్యాప్తి జరిగి.. నియంత్రించడం కష్టమవుతుదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రాణాంతక కోవిడ్‌ను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు తీర్మానం చేయడం.. నిధులు సమకూర్చుకోవడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. అది నిధుల విషయని కాకుండా.. మానవతా స్ఫూర్తి అని కొనియాడారు. కాగా, కరోనాపై పోరుకు ‘కోవిడ్‌–19 ఎమర్జెన్సీ ఫండ్‌’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపిన విషయం విదితమే. భారత్‌ తరఫున ఈ ఫండ్‌ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు.

ఇదిలాఉండగా.. అమెరికాలో సైతం కరోనా పంజా విసురుతోంది. అనుమానితులను గుర్తించడంలో ఆ దేశం విఫలమవడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. అక్కడ మూడు వేలకు పైగా జనం వైరస్‌ బారిన పడగా.. 62 మంది మరణించారు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో ట్రంప్‌ ప్రభుత్వం కళ్లు తెరిచింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం 2000 ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఆదివారం వెల్లడించారు.
చదవండి ►
కోవిడ్‌ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ
కోవిడ్‌-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement