ప్రతి ఇద్దరిలో ఒకరికిపైగా సిజేరియన్
మొత్తం ప్రసవాల్లో ఏకంగా 55 శాతంగా నమోదు
మాతా–శిశు సంక్షేమంపై సర్వత్రా ఆందోళన
కోత కాన్పులపై ప్రభుత్వ నియంత్రణ చర్యలకు డిమాండ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు భారీగా పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా అంతకంతకూ కోత కాన్పులు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10–15 శాతం లోపే ఉండాలి. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న ప్రసవాల్లో ఏకంగా 55 శాతానికి పైనే సిజేరియన్లు ఉంటున్నాయి. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికిపైగా సిజేరియన్ ఆపరేషన్ జరుగుతోందన్నమాట. దేశీయ సగటుకన్నా ఈ సంఖ్య దాదాపు రెట్టింపు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1.16 లక్షల ప్రసవాలు నమోదు కాగా, వీటిలో 55.15 శాతం కోత కాన్పులే కావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రుల్లో అనవసరంగా చేసే సిజేరియన్లు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అనవసర కోత కాన్పుల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విచ్ఛలవిడిగా సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించడం, అనవసర సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలకు ఉపక్రమించే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైద్యశాఖ గణాంకాల ప్రకారం..
⇒ 2023–24లో 7.23 లక్షల ప్రసవాలు నమోదు కాగా వాటిలో 46.19 శాతం సిజేరియన్లు ఉన్నాయి. 2024–25లో ఈ పరిమాణం 50 శాతం, 2025–26లో 54 శాతం పెరిగింది. 2026–27లో 55 శాతం దాటిపోయే పరిస్థితి నెలకొంది.
⇒ 2023–24తో పోల్చితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏకంగా 14 శాతం, సర్కార్ ఆస్పత్రుల్లో 5 శాతం మేర సిజేరియన్లు పెరిగాయి.
⇒ పశి్చమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో 50 నుంచి 60 శాతం మేర కోత కాన్పులే ఉంటున్నాయి.
ఆరోగ్యానికి పెను ముప్పు
⇒ రక్తస్రావం ఎక్కువ అవ్వడంతో మహిళలు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
⇒ తల్లి, బిడ్డలకు అలర్జీలు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ
⇒ సిజేరియన్ సమయంలో వెన్ను భాగంలో అనస్థీషియా ఇస్తారు. దీర్ఘకాలంలో నడుము నొప్పితో పాటు, ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
⇒ గాయం మానడానికి ఎక్కువ రోజుల సమయం పడుతుంది.
⇒ మొదటి ప్రసవం సిజేరియన్ అయితే రెండో సారి దాదాపు అదే అవసరం అవ్వచ్చు.


