ప్రతి 9 మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు

Coronavirus : Global Nutrition Crisis Puts Millions More At Risk - Sakshi

2020 గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌ నివేదికలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోన వైరస్‌ను కట్టడి చేయడం కోసం పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ ఆకలి దప్పులతో అలమటిస్తున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేవంటూ మంగళవారం నాడు ‘2020 గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌’ నివేదిక వెలువడింది. పిల్లలే కాకుండా పెద్దలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేక పోవడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
(చదవండి : ఆగస్టు నాటికి లక్షా 35 వేల కరోనా మరణాలు!)

ప్రాంతం, సంపద, విద్య, విద్యాస్థాయి, వయస్సు, లింగ వివక్ష పేరిట ప్రపంచ ప్రజల్లో సామాజిక అసమానతలు కొనసాగడం వల్ల పోషక విలువలు హరించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తీసుకునే ఆహారంలో పోషక విలువలు పడిపోవడానికి ఆర్థిక సమస్యే ఒక్కటే కాకుండా ‘ప్రాసెస్డ్‌ ఫుడ్‌’, వ్యవసాయ సాగులో వచ్చిన మార్పులు కూడా కారణమని నివేదిక పేర్కొంది. ఈ లోపాలను సరిదిద్దే దిశగా ప్రభుత్వాలు, వ్యాపార వర్గాలు, సమాజాలు కృషి చేయాలని పిలుపునిచ్చింది. 

1. ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మంది. అంటే ప్రతి 9 మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు.

2. భారత్‌లో 17.8 శాతం మగవాళ్లు, 21.81 శాతం మహిళలు స్థూలకాయంతో బాధ పడుతున్నారు. 

3.దాదాపు 15 కోట్ల మంది ఐదేళ్ల పిల్లలు ఎదుగుదలలేక బాధ పడుతున్నారు. నేడు అన్ని వయస్కుల వారు తక్కువ బరువుకన్నా ఎక్కువ బరువు, స్థూలకాయంతో బాధ పడుతున్నారు. అలాంటి వారు ప్రతి ముగ్గురిలో ఒకరు కనిపిస్తున్నారు.

4. నేడు పేద దేశాలతోపాటు ధనిక దేశాలు కూడా ఆహారంలో పోషక విలువలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో పోషక విలువలు కరవై ఆ దేశాల ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఎక్కువ మంది స్థూలకాయంతో బాధ పడుతున్నారు. 

5. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు కూడా పండ్లు, కూరగాయలు, నట్స్, చిరు ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బియ్యం, గోధమ, జొన్న పంటలకు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. 

6. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తక్కువ ధరలకు లభించడంతోపాటు వాటి మార్కెటింగ్‌ ఎక్కువగా జరగడం వల్ల ఎక్కువ మంది ప్రజలు వాటిని ఆశించి పోషక విలువలకు దూరం అవుతున్నారని తెలిపింది.

7. భారత్, పెరు, నైజీరియా, థాయ్‌లాండ్‌ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడిప్పుడే పోషక విలువలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top