కరోనాపై యుద్ధం : భారత్‌పై చైనా ప్రశంసలు | China thanked India for its support in the fight against Corona Virus | Sakshi
Sakshi News home page

భార‌త్ తొలి ద‌శ‌లోనే అరిక‌డుతుంది: చైనా

Mar 26 2020 11:13 AM | Updated on Mar 26 2020 11:16 AM

China thanked India for its support in the fight against Corona Virus - Sakshi

బీజింగ్‌ : క‌రోనా వైర‌స్‌ను అరికట్టడానికి భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటం, కృషిని చైనా ప్రశంసించింది. అలాగే వైరస్‌ కట్టడికి స‌హ‌కారం అందిస్తున్నందుకు భార‌త్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని  చైనా రాయ‌బార ప్ర‌తినిధి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చైనా సంస్థ‌లు భారత్‌కు విరాళాలు ఇవ్వ‌డం ప్రారంభించాయ‌ని, త‌మ సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి  భార‌త్‌ అవ‌స‌రాల మేర‌కు మ‌రింత స‌హాయ‌, స‌హ‌కారాలు అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. అలాగే క‌ష్ట స‌మ‌యాల్లో ఇలాంటి వ్యాధిని ఎదుర్కోవ‌డానికి చైనా, భారత్‌ పరస్పర సహకారం చేసుకుంటాయని చైనా పేర్కొంది. (5లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు)

‘భారతదేశం చైనాకు వైద్య సామాగ్రిని అందిస్తోంది. క‌రోనాకు వ్యతిరేకంగా చైనా చేస్తున్న‌ పోరాటానికి భారతీయ ప్రజలు వివిధ మార్గాల్లో మద్దతు ఇస్తున్నారు. దీనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతీయ ప్రజలు ప్రారంభ దశ‌లోనే క‌రోనా మ‌హ‌మ్మారిపై విజయం సాధిస్తారని మేము న‌మ్ముతున్నాము. భారత్ అలాగే ఇతర దేశాలతో కలిసి ఈ వైర‌స్‌కు వ్య‌తిరేకంగా చైనా పోరాడుతూనే ఉంటుంది, జి 20, బ్రిక్స్ వంటి వేదికల్లో మా సహకారాన్ని అందిస్తాం, మెరుగైన స‌మాజం కోసం మా శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తాం అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. (నీకు క‌రోనా సోకింది.. యువతికి వేధింపులు)

కాగా చైనాలో క‌రోనా తీవ్ర‌త‌ను అరిక‌ట్ట‌డానికి భార‌త్ స‌హాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హ‌మ్మారీని ఎదుర్కునేందుకు అవ‌స‌ర‌మైన‌ వైద్య సామాగ్రిని చైనాకు త‌ర‌లిస్తోంది. ఈ నేప‌థ్యంలో  క‌రోనా మ‌హ‌మ్మారీతో తీవ్రంగా దెబ్బ‌తిన్న వుహాన్ నగ‌రానికి, మాస్క్‌లు, ఇత‌ర వైద్య ప‌రికాల‌తో స‌హా 15 ట‌న్నుల వైద్య స‌హాయాన్ని భార‌త్ చైనాకు అందించింది. కాగా కరోనాకు జన్మస్థలమైన  చైనాలో 81 వేల మందికి వైరస్‌ సోక‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 3,200 మంది మ‌త్యువాత ప‌డ్డారు. ఈ క్రమంలో  వైరస్‌ ప్రపంచ దేశాలకూ పాకింది.
 

Advertisement
 
Advertisement
Advertisement