
ఈ దాడులను ధృవీకరించిన పాక్.. ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 భారత వాయిసేన విజయవంతంగా పూర్తి చేసింది. ఈ దాడులను ధృవీకరించిన పాక్.. తమ బలగాలు తిప్పికొట్టాయని చెబుతూనే.. ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. భారత వాయుసేన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్థిక, రక్షణ శాఖతో ఆయన చర్చిస్తున్నారు. ఇక వాయుసేన దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానికి వివరించారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
తాజా దాడుల నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత వైమానిక మెరుపు దాడులపై యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత వైమానికి దళానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.
🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019