'సువిధ' దోపిడీ | Weekly Suvidha Trains, between Visakhapatnam-Secunderabad and Visakhapatnam-Tirupati | Sakshi
Sakshi News home page

'సువిధ' దోపిడీ

Mar 20 2016 1:37 AM | Updated on Sep 3 2017 8:08 PM

'సువిధ' దోపిడీ

'సువిధ' దోపిడీ

ఈ ఏడాది బడ్జెట్‌లో కొత్త రైళ్లకు స్వస్తి చెప్పిన రైల్వే శాఖ ‘బాదుడు’ రైళ్లను పట్టాలెక్కించనుంది. వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ ఉండే మార్గాల్లో 53 ‘సువిధ’ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది.

- ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీలు    
- వివిధ మార్గాల్లో 53 సువిధ  రైళ్లు ప్రకటించిన ద.మ.రైల్వే
 
 
సాక్షి, హైదరాబాద్:
ఈ ఏడాది బడ్జెట్‌లో కొత్త రైళ్లకు స్వస్తి చెప్పిన రైల్వే శాఖ ‘బాదుడు’ రైళ్లను పట్టాలెక్కించనుంది. వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ  ఉండే మార్గాల్లో 53 ‘సువిధ’ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. దీంతో ప్రయాణికులపై సాధారణ చార్జీలపైన రెట్టింపు భారం పడనుంది. ఒకవైపు చార్జీలు పెంచకుండా మరోవైపు కొత్త రైళ్లను  ప్రకటించకుండానే.. ఉన్న  రైళ్లనే నడిపి అదనపు  ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో సువిధ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సువిధ రైళ్లను విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్  మార్గాల్లో ఏప్రిల్, మే, జూన్ నెల ల్లో ఈ రైళ్లను నడుపనున్నారు. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి.

ఉదాహరణకు  సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్ చార్జీ రూ.365 ఉంటుంది. కానీ సువిధ రైళ్లలో ఇది తత్కాల్ చార్జీలతో అంటే రూ.470తో మొదలవుతుంది. మొదటి 25 బెర్తుల వరకు ఈ చార్జీలుంటాయి. ఆ తరువాత 26వ బెర్తు నుంచి నుంచి 50వ బెర్తు వరకు రెట్టింపవుతాయి. 51వ బెర్తు నుంచి 72వ బెర్తు వరకు రెట్టింపు కన్నా ఎక్కువే ఉంటుంది.

ఈ మార్గాల్లో సువిధ రైళ్లు...
విశాఖ-సికింద్రాబాద్, విశాఖ-తిరుపతి మార్గాల్లో మొత్తం 53 సువిధ రైళ్లను ఈ వేసవిలో నడుపనున్నారు. ఈ మేరకు విశాఖపట్టణం-సికింద్రాబాద్ (08501/08502) సువిధ సూపర్ ట్రైన్ ఏప్రిల్ 5,12,19,26 మే 3,10,17,24,31 తేదీల్లో, జూన్ 7,14,21,28 తేదీల్లో(ప్రతి మంగళవారం) రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6,13,20,27, మే 4,11,18,25,జూన్ 1,8,15,22,29 (ప్రతి బుధవారం) తేదీల్లో సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు విశాఖకు చేరుకుంటాయి.

విశాఖ-తిరుపతి సువిధ వీక్లీ ట్రైన్ (08573/08574) ఏప్రిల్ 4,11,18,25 మే 2,9,16,23,30 తేదీల్లో, జూన్ 6,13,20,27 తేదీల్లో (ప్రతి సోమవారం) రాత్రి 10.55 కు విశాఖ నుంచి  బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.15కు తిరుపతికి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 5,12,19,26,మే 3,10,17,24,31, జూన్ 7,14,21,28 (ప్రతి మంగళవారం) తేదీల్లో రాత్రి 10.55 కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.15కు విశాఖ చేరుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement