‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలి’ | v hanumantha rao takes on kcr and harish rao | Sakshi
Sakshi News home page

‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలి’

Sep 7 2016 10:47 PM | Updated on Sep 19 2019 8:28 PM

కేంద్రప్రభుత్వం నుంచి నిధులు సాధించడం చేతకాక అప్పులుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం నుంచి నిధులు సాధించడం చేతకాక అప్పులుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో బుధవారం వి. హనుమంతరావు  విలేకరులతో మాట్లాడుతూ... ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు తెలంగాణకు ఎందుకు సాధించలేకపోతున్నారని అడిగారు. నాబార్డు నుంచి 7వేల కోట్లు అప్పు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని వీహెచ్ విమర్శించారు.

ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నామనే సోయి కేసీఆర్‌కు, హరీష్‌రావుకు లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. కార్పొరేట్లకు 50వేల కోట్లు మాఫీ చేసి, రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. నయీం కేసు విచారణ సిట్‌తో సాధ్యం కాదని, నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు లేఖ రాసినట్టుగా వీహెచ్ ఈ సందర్బంగా తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement