అవతరణ కళ | Sakshi
Sakshi News home page

అవతరణ కళ

Published Mon, Jun 1 2015 1:30 AM

Telangana state formation celebrations

రసూల్‌పురా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ భద్రత చర్యలు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలసి భద్రతా చర్యలపై చర్చించారు. భద్రత కోసం మూడువేల మంది పోలీసులు, అధికారులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు ఇప్పటికే మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలనిప్రజలకు సూచించారు. వీవీఐపీ, వీఐపీల రాకపోకలను పురస్కరించుకుని ట్రాఫిక్ మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

 తెలుగు విశ్వవిద్యాలయలో...
 నాంపల్లి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించేఈ ఉత్సవాలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తెలంగాణ తేజోమూర్తులు అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేయనున్నారు. 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు తెలంగాణ నృత్య రీతులపై సదస్సు, సాయంత్రం 5గంటలకు డాక్టర్ జి.ఎం.రామశర్మ అష్టావధానం ఉంటుంది.

4న ఉదయం 10.30గంటలకు ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి-వినూత్నాంశాలు’పై సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. 5న ఉదయం 10.30 గంటలకు ‘తెలంగాణ పత్రికలు-గోలకొండ పత్రిక విశిష్టత’పై సదస్సు జరుగుతుంది. ప్రముఖ పత్రికా సంపాదకులు ఈ సదస్సులో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం ‘తెలంగాణ సాహిత్యం-అనువాద ఆవశ్యకత’పై సదస్సు నిర్వహిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలిపారు.
 
 గన్‌పార్‌‌క ముస్తాబు
  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గన్‌పార్క్ ముస్తాబవుతోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేకంగా నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉండే అమరవీరుల స్థూపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లు ఆదివారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. స్థూపాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. గన్‌పార్క్ చుట్టూ కాంతులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అమర్చారు. ఇక్కడ వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. రాజకీయ నాయకులు, విద్యార్థి, ఉపాధ్యాయ, జర్నలిస్టు, ఉద్యోగ సంఘాల నాయకులు ఇక్కడకు రానున్నారు.

Advertisement
Advertisement