సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలితో తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో ఇక్కడ సభ నిర్వహించాలనుకోవడం, దానికి అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ నుంచే ప్రెస్మీట్కు సిద్ధం కావడం.. ఈ అంశాల చుట్టే వివాదం నడుస్తోంది.
అయితే.. జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో గన్పార్క్ వద్ద నివాళులర్పిస్తుండగా.. ఇరు పార్టీల నాయకులు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా, కాంగ్రెస్ నేతలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరవైపులా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరగ్గా.. పిడిగుద్దులు గుప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి కాసేపటికి సర్దుమణిగింది. ఇక పవన్ కల్యాణ్ తీరుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు అక్కడే రాజకీయాలు చేయాలని, తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు.
తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేదని, మనుగడ లేని పార్టీలు ఇక్కడ విజయవంతం కావడం కష్టమని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణం చేస్తామంటే ప్రజలు అంగీకరించరని విమర్శించారు.
పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన వ్యాఖ్యలు, వాటిపై కాంగ్రెస్ ప్రతిస్పందనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


