తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ప్రతినెలా మూడువేల కోట్ల రూపాయలు దాటుతోంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ప్రతినెలా మూడువేల కోట్ల రూపాయలు దాటుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కాస్త నిరాశపరుస్తున్నా, వ్యాట్, ఎక్సైజ్ మాత్రం ఆశించిన స్థాయిలోనే ఉంటున్నాయి. గత ఐదునెలల్లో వచ్చిన ఆదాయం రూ.15,641 కోట్లు. మొదటి నాలుగు నెలల్లో రూ.12,381 కోట్లు కాగా, అక్టోబర్లో 3260 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిసింది.
ఐదు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద మొత్తం రూ.20 వేల కోట్ల వరకు ఖర్చుచేసి ఉం టుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ఐదునెలలుగా వ్యాట్ 2100 కోట్ల రూపాయల నుంచి 2400 కోట్ల మధ్య ఉంటున్నట్టు వాణిజ్యపన్నుల శాఖ పేర్కొంది. అక్టోబర్లోనే నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ద్వారా సమకూరింది. వాహనాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్కోదానికి 180 కోట్ల రూపాయల మేర వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. భూగర్భ ఖనిజాలు, అటవీ ఉత్పత్తులతోపాటు ఇతర వి భాగాల నుంచి 400 కోట్ల వరకు వచ్చింది.