చర్చలు విఫలమైతే మళ్లీ బంద్ | Talks fail to strike again | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలమైతే మళ్లీ బంద్

Oct 15 2015 1:06 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన మందుల షాపుల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ చంద్రగుప్తా, ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎస్ శ్రీరాములు విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాల విధానంలో నిషేధిత మందుల విక్రయాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

దేశవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా మందుల వ్యాపారులు, వారిపై ఆధారపడిన వారు మరో 1.2 కోట్ల మంది ఉన్నారని, ఆన్‌లైన్‌లో విక్రయాల వల్ల వీరంతా ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. జాతీయ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నట్లు కాని పక్షంలో మళ్లీ బంద్ చేపడతామని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ బోధనాసుపత్రులు, జీవన్‌దాన్, అపోలో, మెడ్‌ప్లస్ మినహా అన్ని మందుల దుకాణాలూ మూతపడ్డాయి. రద్దీగా ఉండే కోఠిలోని ఇందర్‌బాగ్ హోల్‌సేల్ దుకాణాలు బోసిపోయాయి. ఈ ఒక్క రోజే రూ.80 కోట్లు నష్టపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement