
‘డబుల్’ ధమాకా!
సార్ .. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా..?’ ... జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగుల ఆరా.
స్లమ్స్లో బహుళ అంతస్తుల భవనాలు
ఎక్కువ మందికి ప్రయోజనమే లక్ష్యం
ఇటు స్లమ్ఫ్రీ.. అటు స్మార్ట్సిటీ
అమలు దిశగా జీహెచ్ఎంసీ
‘సార్ .. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా..?’ ... జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగుల ఆరా. ‘సార్ .. మేం పేదోళ్లం. మాకు ఎక్కడా ఇల్లు లేదు. సీఎం సార్ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందా?’.... సచివాలయంలోని ఓ చిరుద్యోగి ఆశ. ...ఇలా చిరుద్యోగులే కాదు. నెలకు రూ.30 వేల వేతనం పొందుతున్న ఉద్యోగులు సైతం తమకు ఎక్కడా ఇల్లు లేదని... డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందాలంటే ఏం చేయాలో చెప్పాలని తెలిసిన వారినల్లా అడుగుతున్నారు. ఇదీ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్
ఇళ్ల ప్రారంభానంతర పరిణామం.
సిటీబ్యూరో: గవర్నర్ సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాగున్నాయని ప్రశంసించడంతో వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. పేదలు, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ ఆ ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు తమకూ అలాంటి ఇళ్లే కావాలని వివిధ బస్తీల్లోని పేదలు కూడా కోరుతున్నారు. దీంతో ఎక్కువ మందికి వీటిని అందజేసేందుకు ఇకపై అపార్టుమెంట్ల తరహాలో నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. స్థల లభ్యతను బట్టి కనీసం ఐదంతస్తులకు తగ్గకుండా... తొమ్మిది అంతస్తుల వరకు అపార్టుమెంట్లు నిర్మిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరేడు బస్తీలను ఎంపిక చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని దోబీఘాట్లో ఏకంగా తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్, మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు, గోషామహల్ నియోజకవర్గంలోని గోడేకిఖబర్, లంగర్హౌస్ సమీపంలోని అంబేద్కర్నగర్, సనత్నగర్ నియోజకవర్గంలోని హమాలీబస్తీ తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా వీటిని నిర్మించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని స్థలాలను తాత్కాలికంగా ఎంపిక చేసినప్పటికీ ఖరారు కాలేదు.
ఐడీహెచ్ కాలనీ ఆదర్శంగా...
ఐడీహెచ్ కాలనీలోని లబ్ధిదారులు, స్థల లభ్యతను బట్టి జీప్లస్ టూలో అందరికీ ఇళ్లు అందించే అవకాశం ఉండటంతో అక్కడ దాన్ని ఎంచుకున్నారు. ఇకపై గుడిసెలు, ఇరుకు గదుల్లో ఉంటున్న వారితో పాటు ఇతరత్రా ప్రాంతాల్లోని అత్యవసరమైన వారికీ ఇళ్ల సదుపాయం కల్పించేందుకు ఎక్కువ అంతస్తుల్లో నిర్మించాలని భావిస్తున్నారు. నగరంలో స్థలం దొరకడమే బంగారంగా మారడంతో ఉన్న చోటులో ఎక్కువ మందికి ప్రయోజనం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్లతో కూడిన అపార్ట్మెంట్లను నిర్మించాలని యోచిస్తున్నారు. స్థల విస్తీర్ణం, నిబంధనల మేరకు రహదారులు, ఇతర సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ఎన్ని అంతస్తుల్లో నిర్మించవచ్చుననేది నిర్ణయిస్తారు.కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ క్రాస్ రోడ్స్ దగ్గరి చిత్తారమ్మ బస్తీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ దగ్గరి ఎరుకల నాం చారమ్మ నగర్లో సైతం ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
అవగాహన కల్పిస్తూ...
గుడిసెలు, ఇరుకు గదుల్లో ఉంటున్న వారి నుంచి బహుళ అంతస్తులకు ఇప్పటి వరకు పెద్దగా స్పందన లేకపోవడంతో అధికారులు ముందడుగు వేయలేకపోయారు. తక్కువ స్థలమైనా సరే వ్యక్తిగతంగా తమ ఒక్కరికే ఉంటేనే మేలనే భావనతో ఎవరూ ముందుకు రాలేదు. ఐడీహెచ్లోని ఇళ్లు చూశాక ఎక్కువ అంతస్తులున్నా ఒప్పుకుంటారనే నమ్మకంలో అధికారులు ఉన్నారు. రోజుకో బస్తీ వాసులను ఐడీహెచ్ కాలనీకి తీసుకు వెళ్లి అక్కడి సదుపాయాలు చూపిస్తున్నారు. బహుళ అంతస్తుల ఇళ్లయినా రోడ్డు, పార్కింగ్, తాగునీరు, డ్రైనేజీ తదితర సదుపాయాలు ఉండటం వల్ల ఇంటి విలువ తగ్గదని నచ్చజెప్పుతున్నారు. అప్పటికీ వినని వారికి ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో కౌన్సెలింగ్ చేయిస్తున్నారు. చాలామంది దీనికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి చెప్పారు.
ఇటు స్లమ్ ఫ్రీ.. అటు స్మార్ట్
ఈ విధానం వల్ల అపార్ట్మెంట్లతో పేదల బస్తీల రూపురేఖలు పూర్తిగా మారిపోయి స్లమ్ ఫ్రీగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు. స్మార్ట్సిటీగా ఎంపికయ్యే నగరాల్లో పేదలకు గృహ సదుపాయం కూడా ఒక అంశంగా ఉండటంతో అందుకూ ఇది ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.