కేసులో ప్రతి అడుగూ అనుమానమే! | shirisha, prabhakar reddy suicides mistery unfolds | Sakshi
Sakshi News home page

శిరీష కేసు: ప్రతి అడుగూ అనుమానమే!

Jun 15 2017 6:27 PM | Updated on Nov 6 2018 8:28 PM

కేసులో ప్రతి అడుగూ అనుమానమే! - Sakshi

కేసులో ప్రతి అడుగూ అనుమానమే!

బ్యూటిషియన్‌ శిరీష మృతి కేసులో ప్రతి అడుగు అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.

15 నిమిషాల్లో ఫ్లాట్‌లోకి వెళ్లి ఆత్మహత్య?
అంతుచిక్కని మిస్టరీ


హైదరాబాద్‌: బ్యూటిషియన్‌ శిరీష మృతి కేసులో ప్రతి అడుగు అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం ఉదయమే శిరీష స్టూడియోకు వచ్చింది. శ్రవణ్, రాజీవ్‌లు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. వారంతా కలసి రాత్రి 9.30 గంటల సమయంలో రాజీవ్‌కు చెందిన ఎండీవర్‌ కారులో కుకునూర్‌పల్లికి వెళ్లారు. నేరుగా ప్రభాకర్‌రెడ్డి పోలీస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వెళ్లేముందు రాత్రి 8.40 గంటల సమయంలో తన భర్తకు ఫోన్‌ చేసిన శిరీష.. ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. అర్ధరాత్రి వరకు ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పంచాయితీ జరిగాక.. సుమారు ఒంటిగంట సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా తన భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్‌ ద్వారా లోకేషన్‌ పంపింది. ఆ వెంటనే సతీశ్‌ ఫోన్‌ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి ఫోన్‌ చేసినా స్పందన రాలేదు.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ముగ్గురూ స్టూడియో వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యంలోనూ వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. శిరీష కారు ఆపాలంటూ రెండుసార్లు కిందికి దిగివెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరు ఆమెకు సర్దిచెప్పి స్టూడియో వరకు తీసుకొచ్చారు. అక్కడికి చేరుకోగానే శిరీష అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులోని స్టూడియోలోకి వెళ్లిపోయింది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని భావించిన శ్రవణ్‌.. కింది నుంచే వెళ్లిపోయాడు. పదిహేను నిమిషాల తర్వాత రాజీవ్‌ స్టూడియోలోకి వెళ్లాడు. అయితే అప్పటికే శిరీష ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించిందని.. తానే చున్నీ కత్తిరించి మంచంపై పడుకోబెట్టానని రాజీవ్‌ చెబుతున్నాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంగళవారం ఉదయం 6.30కు శిరీష భర్త సతీశ్‌కు ఫోన్‌ చేసి అక్కడకు రప్పించారు.

కుకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన శిరీష...కేవలం 15 నిమిషాల్లో ఫ్లాట్‌లోకి వెళ్లి ఎలా ఆత్మహత్య చేసుకుంది అనేది అంతువీడకుండా ఉంది. అసలు శిరీష ఆత్మహత్య చేసుకునేంత విషయం ఏం జరిగింది. కుకునూర్‌పల్లిలో ఎస్సైతో జరిగిన పంచాయితీతోనే శిరీష కలత చెందిందా..? లేదా ...శిరీష, రాజీవ్‌, శ్రావణ్‌ ముగ్గురు కలిసి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా గొడవపడ్డారా అనేది తెలియదు.

అసలు ఈ ఘటనలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే  అంతుపట్టకుండా ఉంది. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యను సవాల్‌గా తీసుకున్న సిద్దిపేట పోలీసులు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎస్సై ఆత్మహత్యపై  డిఎస్పీ తిరుపతన్నను విచారణ అధికారిగా నియమించారు. ఎస్సై ఆత్మహత్యకు శిరీష మృతి మధ్య సంబంధం, రాజీవ్‌, శ్రావణల లింకు బయటపడటంతో విచారణాధికారిగా ఉన్న తిరుపతన్న హైదరాబాద్‌కు వచ్చారు. రాజీవ్‌, శ్రావణ్‌లను వేర్వేరుగా విచారిస్తున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులతోనూ  మాట్లాడి శిరీష మృతిపై వివరాలను తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement