ఇంకా పరారీలోనే సినీ దర్శకుడు | police search continues for director nalluri ramakrishna | Sakshi
Sakshi News home page

ఇంకా పరారీలోనే సినీ దర్శకుడు

Mar 24 2017 7:57 PM | Updated on Sep 27 2018 9:08 PM

ఇంకా పరారీలోనే సినీ దర్శకుడు - Sakshi

ఇంకా పరారీలోనే సినీ దర్శకుడు

పాత నోట్ల మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు, సినీ దర్శకుడు కిట్టు ఇంకా పరారీలోనే ఉన్నాడు.

హైదరాబాద్‌: పాత నోట్ల (రద్దయిన పెద్ద నోట్లు) మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు, సినీ దర్శకుడు కిట్టు అలియాస్‌ నల్లూరి రామకృష్ణ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఆయన కోసం బంజారాహిల్స్‌ పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లోని కమలాపురి కాలనీలో సినిమా కార్యాలయం తెరిచి ఆ ముసుగులో పాత నోట్ల దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు 13న రాత్రి పోలీసులు దాడులు చేపట్టారు. ఆ సమయంలో కిట్టు పోలీసుల నుంచి తప్పించుకోగా అక్కడున్న సినీ కార్యాలయం సిబ్బందిని, పాత నోట్లు మార్పిడి కోసం వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏడుగురిని 14న అరెస్టు చేశారు.

ప్రధాన నిందితుడిగా ఉన్న కిట్టు కోసం గాలిస్తూనే ఆయనకు చెందిన కారును సినిమా కార్యాలయం వద్ద సీజ్‌ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులను నిఘాలో ఉంచారు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉందని సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ను క్యాచ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో కిట్టు ప్రధాన నిందితుడని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు డైరెక్టర్‌ కిట్టు ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కోర్టు వద్ద పోలీసులు నిఘా పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement