
గిరిజనులను గాలికొదిలేశారు
ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులను పట్టించుకోకుండా వారిని టీడీపీ ప్రభుత్వం గాలికొది లేసిందని, ప్రజలు, రైతుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని తూర్పు గోదావరి
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత కన్నబాబు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులను పట్టించుకోకుండా వారిని టీడీపీ ప్రభుత్వం గాలికొది లేసిందని, ప్రజలు, రైతుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విలీన మండలాల్లోని అన్నవ రం గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో ఇప్పటికి 15 మంది మరణించారని, అలా ఎందుకు మృతి చెందుతున్నారో ప్రభుత్వం నిగ్గు తేల్చలేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తనతో పాటుగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆ గ్రామంలో పర్యటించినపుడు అక్కడి నీళ్లు తాగడానికి ఏ మాత్రం పనికిరావనే విషయం తేలిందన్నారు.
ఈ విషయాన్ని తాము ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇంత వరకూ పట్టించుకోలేదన్నారు. ఇటీవల రెండు రోజుల పాటు పోలవరం నిర్వాసిత గ్రామాల్లో జగన్ పర్యటన సందర్భంగా రంపచోడవరంలోని ఏపీ ఆశ్రమ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినపుడు అక్కడ ఎన్నో సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. చింతూరు ప్రభుత్వ కళాశాలలో మరుగుదొడ్లు లేవని అక్కడి విద్యార్థినులు చెప్పుకున్నారన్నారు. ప్రభుత్వం నిష్క్రియాపరత్వంతో ఉంది కనుక మనమే ఏదైనా చేయాలని జగన్ సంకల్పించారన్నారు. కలుషిత తాగునీటితో మరణాలు ఎక్కువగా జరుగుతున్న చోట్ల ఆర్వో ప్లాంట్లు నెలకొల్పడానికి, రంపచోడవరం, చింతూరు కళాశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడానికి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఎంపీ నిధులు ఇవ్వడానికి అంగీకరించారన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులు, గిరిజనేతరులు ప్రతిపక్ష నేత జగన్ను కలిసి న్యాయం చేయాలని కోరుతున్నారంటే.. ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్థమవుతోందని కన్నబాబు అన్నారు.