వాట్సాప్‌లో చాట్ చేస్తోందని.. చంపేశాడు! | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో చాట్ చేస్తోందని.. చంపేశాడు!

Published Wed, Jul 8 2015 7:59 PM

వాట్సాప్‌లో చాట్ చేస్తోందని.. చంపేశాడు! - Sakshi

భార్య తరచు వేరేవాళ్లతో ఫోన్లో మాట్లాడుతోందని.. వాట్సప్లో కూడా చాట్ చేస్తోందని అనుమానం పెంచుకున్న ఓ భర్త.. కట్టుకున్న భార్యను తలపై ఇనుప రాడ్తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

సీతారాంపేట్ ప్రాంతంలో నివసించే రాజేశ్‌శర్మ చార్మినార్ పటేల్ మార్కెట్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి 14 ఏళ్ల క్రితం సరిత(34)తో పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా సరిత తరచూ ఫోన్‌లో ఇతరులతో మాట్లాడుతూ ఉండడం, వాట్సప్‌లో చాటింగ్ చేయడం గమనించిన రాజేశ్‌శర్మ పలు మార్లు భార్యను హెచ్చరించాడు. అయినా, ఆమె తన తీరు మార్చుకోలేదు.

బుధవారం నాడు పనికి వెళ్లకుండా ఇంటివద్దనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో సరిత ఎవరితోతో ఫోన్‌లో మాట్లాడడం గమనించిన రాజేశ్‌శర్మ ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. బాగా కోపం వచ్చిన రాజేశ్‌శర్మ పక్కనే ఉన్న ఇనుపరాడుతో సరిత తలపై బాదాడు. దీంతో సరిత రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అతడు మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Advertisement
Advertisement