మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకంపై బాధిత రైతుల వేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
హైదరాబాద్: మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకంపై బాధిత రైతుల వేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రైతులు అడిగిన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవో నెంబర్ 123 అనేది ఒక ప్రక్రియ మాత్రమేనని.. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేకపోతే భూసేకరణ చట్టం ద్వారా ముందుకెళ్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
కాగా, మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జీవో 123 కింద భూ సేకరణ నిలిపేసి, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లా తోగుట మండలంలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు అడియాల రంగారెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.