
స్వప్రయోజనాల కోసమే పార్టీ వీడుతున్నారు
కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాంచందర్ కుంతియా అన్నారు.
గాజులరామారం/చింతల్: కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడుతున్నారని రాజ్యసభ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాంచందర్ కుంతియా అన్నారు. మంగళవారం కుత్భుల్లాపూర్ వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాజీవ్ గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకుని నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘యాంటీ టైజం డే’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత ప్రాధాన్యతను గుర్తించి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. ప్రస్తుతం కమ్యునికేషన్, అంతరిక్ష పరిశోధనల అభివృద్ధికి ఆయనే మ బాటలు వేశారన్నారు. రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్రాల విభజన చేయలేదని, దేశఅభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విభజనలకు మద్దతు ఇచ్చామన్నారు. కొందరు నేతలు తమ వ్యాపారాలు, ఛానళ్లను కాపాడుకునేందుకు, పదవుల కోసం టీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు.
అదో పిచ్చి కేసు...
కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అగస్ట్యా వేస్ట్ ల్యాండ్ అర్ధం లేనిదన్నారు. వీహెచ్ మాట్లాడుతూ రెండేళ్ల మోదీ పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. సోనియా రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ లేడన్నారు. సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మోదీ ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనీల్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ తదితరులు పాల్గొన్నారు.