ఫీజుల వసూలు విషయంలో ప్రస్తుతమున్న విధానాన్నే అనుసరించాలని ప్రభుత్వం చెబుతుం డగా.. పెంచి తీరాల్సిందేనని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల లొల్లి
పరిమితికి లోబడి ఉండాలంటున్న అధికారులు
రూ.25 వేలకు పెంచాలంటున్న యాజమాన్యాలు
కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన ప్రతినిధులు
ఇప్పటికే ఎక్కువంటున్న విద్యార్థి సంఘాలు
నేడు విద్యాశాఖపై సమీక్షించనున్న కలెక్టర్
సిటీబ్యూరో:
ఫీజుల వసూలు విషయంలో ప్రస్తుతమున్న విధానాన్నే అనుసరించాలని ప్రభుత్వం చెబుతుం డగా.. పెంచి తీరాల్సిందేనని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. మూడేళ్ల క్రితం జారీ చేసిన జీఓ ప్రకారం ఫీజులు తీసుకోవడం కుదరదని స్పష్టం చేస్తున్నాయి. ఈ మూడేళ్లలో అన్ని రకాల పనులు, ఇతరత్రా ఖర్చులు పెరిగినందున నూ తన ఫీజు విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఫీజులు పెంచడం సరికాదని, ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులు సహేతుకంగా లేవని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఇలాం టి డిమాండ్ల నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
సర్కార్ ఆదేశాలు వీరికి వర్తించవా?
సెంట్రల్(సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ) సిలబస్ బోధిస్తోన్న పాఠశాలల యాజమాన్యాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను, అధికారుల ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ కోరినా.. పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. సిలబస్ ఏదైనా నగరంలోని పాఠశాలలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
జీఓ నం.42 ప్రకారం..
వాస్తవానికి 2011లో ఫీజుల నియంత్రణ విషయమై ప్రభుత్వం జీఓ నెంబరు 42ను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం నగరంలోని ప్రైవేటు పాఠశాలలో ప్రైమరీ (ఒకటి నుంచి ఐదోతరగతి వరకు) ఫీజు రూ.9 వేలు, ఉన్నత పాఠశాల(6 నుంచి పదో తరగతి వరకు)ల్లో రూ.12 వేలకు మించకూడదు.
స్పందించని 833 పాఠశాలలు..
ప్రస్తుత విద్యా సంవత్సరం వసూలు చేస్తోన్న ఫీజుల వివరాలను అందజేయాలని యాజమాన్యాలను ఇటీవల విద్యాశాఖ కోరింది. నగరంలో మొత్తం 2,107 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో 1,274 పాఠశాలల యాజమాన్యాలు తాము వసూలు చేస్తోన్న ఫీజుల వివరాలను విద్యాశాఖకు సమర్పించాయి. 1,030 పాఠశాలల్లో ఫీజులు నిబంధనలకు లోబడే ఉన్నట్టు తెలిసింది. 244 పాఠశాలల్లో ఫీజులు పరిమితిని మించగా, 833 పాఠశాలల యాజమాన్యాలు అసలు వివరాలనే సమర్పించలేదు.
రూ.25 వేలకు పెంచాలని డిమాండ్
మూడేళ్ల క్రితం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలని కోరడం ఆమోదయోగ్యం కాదని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘాలు పేర్కొంటున్నాయి. జీఓలో పేర్కొన్న విధ ంగానే ప్రతి మూడేళ్లకోమారు ఫీజుల పెంపును సమీక్షించి పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. పాఠశాలల్లో పనిచేసే టీచర్ల వేతనాలు, విద్యుత్, నీటి బిల్లులు గత మూడేళ్లలో 100 శాతం, భవనాల పన్ను 300 శాతం పెరిగాయని యాజమాన్య సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రైమరీ తరగతులకు రూ.18 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.25 వేలకు పరిమితిని పెంచాలని వారు కోరుతున్నారు. ఫీజులు, గుర్తింపులేని పాఠశాలల విషయమై బుధవారం కలెక్టర్ అధ్యక్షతన విద్యాశాఖ సమీక్ష జరగనున్నందున.. గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కొణతాల ఉమామహేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ ప్రసాద్, అసోసియేషన్ ప్రతినిధులు వీవీ రావు, చంద్రశేఖర్ , బ్రిగెట్ మైఖేల్, డాక్టర్ జీఈ సీత తదితరులు సోమవారం కలెక్టర్ ముఖేష్ను కలిసి ఫీజులు పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.