హరితహారంలో ప్రతి పౌరుడూ పాల్గొనాలి | Every People should be participated in Harithaharam programme | Sakshi
Sakshi News home page

హరితహారంలో ప్రతి పౌరుడూ పాల్గొనాలి

Jul 11 2016 1:30 AM | Updated on Aug 15 2018 9:35 PM

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెండు వారాలపాటు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

- జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెండు వారాలపాటు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు ప్రజాప్రతినిధులతోపాటు అన్ని స్థాయిల అధికారులను సమన్వయం చేసుకోవాలని, హరితహారాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా నడిపించాలని సూచించారు. ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటేలా కార్యాచరణ, వ్యూహాలను రూపొందించాలన్నారు.

కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను తన క్యాంపు కార్యాలయానికి పంపించాలని, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించే చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల వెంట, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, ఖాళీ ప్రదేశాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలనే అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement