బంజారాహిల్స్ రాణా పరిధిలో చోటు చేసుకున్న చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఘటన పెనుమార్పులకు నాంది పలుకుతోంది.
► ట్రాఫిక్ కౌన్సెలింగ్లో కార్డు చూపడం
తప్పనిసరి
► మందుబాబుతో పాటు సంబంధీకులూ
తేవాల్సిందే
► జైలు శిక్షలు పెంచడంపై
న్యాయ విభాగానికి విన్నపం
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్ రాణా పరిధిలో చోటు చేసుకున్న చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఘటన పెనుమార్పులకు నాంది పలుకుతోంది. ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు... వీటి నేపథ్యంలో డ్రైవ్స్లో చిక్కిన వాహనచోదకులు ఎలాంటి ఎత్తులు వేయకుండా కట్టడికి చర్యలు చేపట్టింది. మరోపక్క మోటారు వాహనాల చట్టంలో పేర్కొన్న విధంగా కఠిన శిక్షలు వేయాలని కోరుతూ న్యాయ విభాగానికి విన్నవించింది. ట్రాఫిక్ విభాగం చేపట్టే తనిఖీల్లో మద్యం తాగి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడుపుతూ చిక్కుతున్నారు. అప్పటికప్పుడు వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్న ట్రాఫిక్ విభాగం అధికారలు నిర్ణీత సమయాల్లో గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ల్లో (టీటీఐ) జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావడం తప్పనిసరి చేశారు. అక్కడి కౌన్సెలింగ్ తర్వాతే ఆయా ఉల్లంఘనుల్ని దాని తీవ్రతను బట్టి కోర్టుకు తరలించడం, జరిమానా వసూలు చేయడం చేస్తున్నారు.
ఆధార్ కార్డు తేవాల్సిందే...
ఇప్పటి వరకు ఈ కౌన్సెలింగ్కు కేవలం ఉల్లంఘనుడు మాత్రమే హాజరయ్యేవాడు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం... సదరు ఉల్లంఘనులు వివాహితులైతే భార్య/భర్త, అవివాహితులైతే తల్లిదండ్రులు/సంరక్షకుడితో కలిసి హాజరుకావడం తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే ఉల్లంఘనులు తమ విషయం ఇంట్లోవారికి తెలియకుండా ఉండేందుకు డమ్మీలను రంగంలోకి దింపే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి డమ్మీలకు చెక్ చేప్పేందుకు ఆధార్ కార్డు తీసుకురావడం తప్పనిసరి చేస్తున్నారు. ఉల్లంఘనుడితో పాటు అతడితో కౌన్సెలింగ్ వచ్చే వాళ్లూ ఆధార్ కార్డు తీసుకురావాలి. అందులోని వివరాలు, వయసులను సరిచూసిన తర్వాతే కౌన్సెలింగ్కు అనుమతిస్తారు. ఆధార్ కార్డు జారీ కాని పక్షంలో వారి బంధుత్వాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలు చూపాలి. ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా మాత్రం కౌన్సెలింగ్కు అనుమతించమని, ఎవరైనా చీటింగ్కు యత్నిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
వారికి ఆటోమేటిక్గా సమాచారం...
‘డ్రంకన్ డ్రైవ్’తో పాటు వివిధ రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కుతున్న వారిలో విద్యార్థులు, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటి వరకు పోలీసుల వద్ద మాత్రమే ఉండే ఈ సమాచారాన్ని ఇకపై వారు చదువుతున్న/పని చేస్తున్న సంస్థలు, విభాగాలకు అందించాలని నిర్ణయించారు. దీనికోసం ఆయా యాజమాన్యాలు, శాఖలకు లేఖలు రాయాలని తొలుత భావించారు. ఇందులో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో నగరంలోని ఆయా సంస్థలు, ప్రభుత్వ శాఖలకు నేరుగా ఈ–మెయిల్ పంపేలా డేటాబేస్లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ రాస్తున్నారు. ఇందులో లేని వాటికి మాత్రమే లేఖలు రాస్తారు.
కౌంట్స్ ‘తగ్గింపు’... శిక్షల పెంపు...
మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన ఉల్లంఘనుల్ని కౌన్సెలింగ్ తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్నారు. వారు తీసుకున్న మద్యం మోతాదు, అప్పటి వరకు ఎన్నిసార్లు పట్టుబడ్డారనేది పరిగణలోకి తీసుకొని న్యాయస్థానాలు జైలు శిక్షలు విధిస్తున్నాయి. బ్రీత్ ఎనలైజర్లు (శ్వాస పరీక్ష యంత్రాలు) వాహనచోదకుడి శరీరంలో ఉన్న ఆల్కహాల్ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మి.గ్రా కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన. అయితే నగరంలో 300 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్తో దొరికిన వారున్నారు. ఇప్పటి వరకు కోర్టులు 100 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్తో, ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారికి మాత్రమే ఒక రోజు నుంచి 20 రోజుల వరకు శిక్షలు విధిస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ట్రాఫిక్ అధికారులు న్యాయ విభాగాన్ని కోరారు. 50 కంటే ఎక్కువ బీఏసీ కౌంట్ వచ్చినా, సదరు వాహనచోదకుడు తొలిసారి చిక్కినా జైలు శిక్ష వేయాలని కోరుతున్నారు. ఈ శిక్షాకాలాన్ని సైతం మద్యం మోతాదును బట్టి పెంచాలని నివేదించారు.