టీవీల్లో నేర కథనాలను స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు క్రిమినల్గా మారాడు.
అంబర్పేట (హైదరాబాద్): టీవీల్లో నేర కథనాలను స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు క్రిమినల్గా మారాడు. బాలికలకు మాయమాటలు చెప్పి వారి నుంచి ఆభరణాలను కొట్టేస్తున్న ఈ ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. పోలీసులు నిందితుడి నుంచి రూ. 7.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అంబర్పేటలో విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ వి.రవీందర్ వివరాలు వెల్లడించారు. బర్కత్పురలోని రత్నానగర్కు చెందిన బాతుల రవికిరణ్(28) అలియాస్ టింకు... ఎలక్ట్రీషియన్గా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం చాలకపోవడంతో 2012లో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. కాలనీలు, పాఠశాలల వద్ద 8 నుంచి 12 ఏళ్ల వయసులోపు ఉన్న బాలికలను మాటల్లో దింపి మీ తల్లిదండ్రులు బాగా తెలుసునని నమ్మించేవాడు. క్రీడా పరికరాల బహుమతులు ఇప్పిస్తానని చెప్పి వారిని తన వాహనంపై కొద్ది దూరం తీసుకెళ్లి ఆభరణాలు తీసుకుని పరారయ్యేవాడు. ఇలా సుమారు 150 చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల కాచిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఓ బాలిక నుంచి నిందితుడు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని ఫోటోలు సేకరించి మీడియాకు విడుదల చేశారు. రవికిరణ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు రత్నానగర్లో అదుపులోకి తీసుకున్నారు. అతణ్నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, 2.7 కిలోల వెండి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.