దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్ | chandra babu filed quash petition only with fear, says alla ramakrishna reddy | Sakshi
Sakshi News home page

దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్

Sep 1 2016 2:09 PM | Updated on Jul 28 2018 6:51 PM

దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్ - Sakshi

దోషిగా తేలుతానన్న భయంతోనే క్వాష్ పిటిషన్

ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు.

ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. సీఆర్‌పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా.. నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు, ఆయనను దోషిగా చేర్చాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్కేనే.

''విచారణ అర్హత ఉందని ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు వెళ్లొద్దని స్పష్టంగా అడిగాను. విచారణ ఎదుర్కోడానికి మీకు ఎందుకు భయం.. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? ఈ రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా గడుపుతూనే ఉన్న మీరు.. ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిందే. ఈ రెండు రోజుల్లో భయం లేనట్లు నటిస్తూనే గవర్నర్ వద్దకు ఎవరెవర్ని పంపారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. చట్టంలో ఉన్న చుట్టాలు కూడా ఎవరూ రక్షించలేరని తెలియడం వల్లే క్వాష్ పిటిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది'' అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

దర్యాప్తు జరిగితే తాను దోషిగా తేలుతానన్న విషయం చంద్రబాబుకు తెలుసని, తన గొంతును ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు ధ్రువీకరించినందు వల్లే బాబు భయపడుతున్నారని ఆర్కే అన్నారు. ఈ కేసులో తన పాత్ర బయట పడుతుందన్న భయంతోనే బాబు క్వాష్ పిటిషన్ వేశారన్నారు. గతంలో చాలామంది మహామహులు సీఆర్‌పీసీ 156 (3) కింద విచారణను ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. జయలలిత, జస్వంత్ సింగ్, కేంద్రమంత్రులు అందరూ ఇదే సెక్షన్, క్లాజు కింద విచారణ ఎదుర్కొన్నారన్నారు. అసలు విచారణ ఎదుర్కోకుండానే కేసు నుంచి తప్పించుకోవాలని ఆయన కోరడమేంటని ప్రశ్నించారు.  దాన్ని బట్టే మీరు ఎంత తప్పు చేశారో తెలిసిపోతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement